Thursday, May 21, 2015

దశాబ్దాల పోరాట చరిత్రకు చిచ్చు – హైకోర్టు మార్గదర్శకాలు- హేమలలిత

దశాబ్దాల పోరాట చరిత్రకు చిచ్చు – హైకోర్టు మార్గదర్శకాలు- హేమలలిత

      ప్రముఖ మహిళా విప్లవకారిణి క్లారాజెట్కిన్‌తో లెనిన్‌ ఓ మాట అంటారు. ‘చట్టం ప్రాతిపదిక మాత్రమే చట్ట సమానత్వం సంపూర్ణ సమానత్వం కాదని, యిది నూటికి నూరుపాళ్ళు వాస్తవమే’. సమానత్వం కోసం చట్టాల్ని ప్రాతిపదిక చేసుకోవాలని ఆపై సంపూర్ణ సమానత్వం పొందడంలో చట్టం తొలి అడుగు కావాలని స్త్రీలు ఎన్నో పోరాటాలు చేసారు. అయితే వీటికి భిన్నంగా గడిచిన దశాబ్దాల మహిళా మేధావుల కృషి, ఉద్యమకారుల సంఘాల పోరాటాల సాక్షిగా స్త్రీల మనోభావాలకు, సామాజిక స్థితిగతులకు వ్యతిరేకంగా స్త్రీలపై మరింత హింస ప్రజ్వరి ల్లేలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కొన్ని మార్గదర్శక సూత్రాలను జారీ చేసింది.
భార్యా భర్తలను ఏకం చేయడం కంటే వారి బంధాన్ని విచ్ఛిన్నం చేయిడానికి భారత శిక్షాస్మృతిలోని సెక్షన్‌ 498(ఎ) (భార్యపై భర్త, ఆయన తరుపు బంధువులు క్రూరత్వాన్ని ప్రదర్శించడానికి సంబంధించిన సెక్షన్‌) ఒక ఆయుధంగా ఉపయోగపడటం దురదృష్టకరమని హైకోర్టు అభిప్రాయపడింది. భర్తను దారిలోకి తెచ్చుకోవాలనే ఉద్దేశంతో కొంతమంది ఈ సెక్షన్‌ ఉపయోగించి పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేస్తున్నారని వ్యాఖ్యానించింది. సరైన సలహాలు ఇచ్చేవారు లేకనే ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమైతున్నాయని భర్తని మాత్రమే కాకుండా అత్తమామలు, ఆడపడుచులు వారి బంధువులను వేధింపులకు గురిచేయటానికి ఈ సెక్షన్‌ను ఉపయోగిస్తు న్నారని పెర్కొన్నది. అయితే ఇది ఈనాటి తీర్పు మాత్రమే కాదు. అత్తింటి వారిపై అభియోగాలు (అనవసర) మోపరాదని వరకట్నం మృతికేసుల్లో సుప్రీమ్‌కోర్టు ఒక కీలక తీర్పును 2010లో ఇచ్చింది.
ఇంతకీ 498′ఎ’ సెక్షన్‌ అంతట మహమ్మారీగా కనిపిస్తుంది. నిజానికి రెండింతులు పైగానే ముద్దాయిలు విడుదలౌతున్నారు. చట్టం ప్రకారం 498′ఎ’ ప్రకారం ఒక స్త్రీ తనపై జరిగే హింస వలన అత్మహత్య చేసుకొనే పరిస్థితులు నెలకొన్నా, లేక వరకట్నం కోసం డిమాండ్‌ చేసి హింసించడం నేరము. ఈ సెక్షన్‌తో పాటు అపరాధిత నమ్మక ద్రోహం (406), బెదిరించడం (506) కూడ ఒక్కొక్కసారి మోపబడతాయి. ఒకవేళ వరకట్నం మృతి జరిగితే 304′బి’, అత్మహత్య చేసుకోవటానికి ప్రేరింపించడం 306 లాంటివి కూడా మోపబడతాయి. కాని ప్రాసిక్యూషన్‌ గట్టి సాక్ష్యాధారాలతో నిరూపించవలసి వుంటుంది. ఇవి చాలా వరకు కోర్టులో నిలబడవు. విచారణ ముగిసేలోపే చాలా కేసులు సయోధ్యకు వస్తాయి. ఒకవేళ శిక్షించబడ్డ ముద్దాయిలు అప్పీలు చేసుకోవటానికి బెయిల్‌ మంజూరు అవుతుంది. అలా వాడు సుప్రీంకోర్టుకు వెళ్ళెలోపల ఇక్కడ స్త్రీ జీవితం చిధ్రమౌతుంది. ఇన్ని అవకాశాలు ఉన్న ముద్దాయిలకు అన్యాయం జరుగుతుందనే ధోరణి హైకోర్టు, సుప్రిం కోర్టులలో కల్పించడం వారి పితృస్వామిక ధోరణికి నిదర్శనం.
సుప్రీమ్‌కోర్టు ప్రీతిగుప్తా వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ జార్ఖాండ్‌ కేసులో ఇచ్చిన అదేశాల మేరకు ‘లా’ కమిషన్‌ చాలా స్పష్టంగా 498′ఎ’ సెక్షన్‌ నాన్‌ బెయిలబుల్‌గా ఉండాలనే సిఫార్స్‌ చేసినది. అంతేకాకుండా పార్లమెంటరీ కమిటి ఒక్క సంవత్సరం పాటు వివిద రాష్ట్రాలలో పర్యటించి, ఈ సెక్షన్‌ అమలులో స్థితిగతులను తెలుసుకోవటానికి అధ్యయనం చేసింది. అయినప్పటికి ఆ కమిటి ఈ సెక్షన్‌ను ప్రజలు వ్యతిరేఖిస్తుందన్నారని చెప్పలేదు. కాని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర హైకోర్టు ప్రజాభిప్రాయాలకు భిన్నంగా వెళ్ళడం ఆశ్చర్యకరం. హైకోర్టు అదేశాల ప్రకారం కేసు దర్యాప్తు డి.యస్పీ ర్యాంకుకు తగ్గని వారితో చేయాలి. ఒకవేళ తప్పుగా కేసులో ఇరికించారని అనుమానిస్తే, జిల్లా పోలీసు అధికారిగార్కి తెలియజేసి చార్జిషీటులో వారి పేరును తొలిగించవచ్చును. మేజిస్ట్రేట్‌ యాంత్రికంగా జైలుకు పంపకూడదు. ధనం, కులం, మతం అవినీతి అధికార హోదాలో ఉన్నప్పుడు స్త్రీలకు ఎటువంటి న్యాయం జరుగుతుందో ప్రజాస్వామిక వాదులుగా మనం ఊహించగలం.
ఈ తరహా మార్గదర్శకాలు డా|| బాబా సాహబ్‌ వ్రాసిన రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం. 1950లలో హిందూ కోడ్‌ బిల్లు కోసం ఆయన చేసిన పోరాటం స్పురణకొస్తున్న సందర్భం ఇది. ఆనాడు ఫాసిస్టు మతవాద శక్తులు ఏలాగతై స్త్రీల హక్కుల రక్షణకు గండి కొట్టారో ఈనాడు ప్రపంచీకరణలో స్త్రీల స్థితి గతులకు అడ్డుపడుచున్నారు. ఈ తరహా మార్గదర్శకాలు మహిళా మేదావులు చేసిన కృషిని అపహస్యం చేయడమే కాదు, మహిళా సంఘాల అవిరణ పోరాట స్ఫూర్తిని అవమానపర్చినట్లే ఇలాంటి పితృస్వామిక భావజాలంతో కూడిన తీర్పులను ఇస్తున్న న్యాయ వ్యవస్థను ప్రశ్నించవలసిన అవసరం నేడు ఉంది. వ్యవస్థ మారనంత వరకూ సామాజికంగా స్త్రీలకు రక్షణ లేదన్నప్పటి అవగాహన మన న్యాయవ్యవస్థకు లేదనటానికి ఈ తీర్పు ఒక తార్కాణం. తను చేసిన చట్టాలను సక్రమంగా సరైన రీతిలో అమలు చేయలేని యాంత్రాంగం ఈనాడు తాను చేసిన చట్టాలనే తానే నిర్వీర్యపర్చుతుందన్నటానికి ఇది ఒక తాజా ఉదాహరణ.
సంఘటితంగా హైకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను అడ్డుకోవాల్సిన చారిత్రిక బాధ్యత మన స్త్రీలందరిపైన ఉన్నది. స్త్రీలకోసం మన కేంద్ర పదవినే వదులుకొన్న త్యాగమూర్తి బాబాసాహెబ్‌ లాంటి పురుషుల సహాకారం, బాధ్యత ఉంది. అందరం కలిసి దశాబ్దాలుగా పోరాడి, సాధించి, పొందిన చట్టాలను రాజ్యాంగ స్ఫూర్తిని తూట్లు పొడవకుండా కాపాడుకోవల్సిన అవశ్యకత నేటి మన కర్తవ్యం. స్త్రీల హక్కులను హరించే ఈ మార్గదర్శకాలకు వ్యతిరేకంగా ఐక్యమవుదాం. మన హక్కులను మనం తిరిగి పొందేందుకు అవిశ్రాంతిగా మన లక్ష్యం వైపు కలసినడుద్దాం.

ఆమె @ సమానత్వం కాలం

                   ఆమె @ సమానత్వం కాలం 
"ఆమె ఆవేశం అర్థం కావాలంటే ఆమె స్థానం లో మన ముండాలి . అంతే కాదు ,                    ఆమె గుండె కూడా మనకుండాలి " - కాళీ పట్నం రామారావు మాష్టారు

                                              -హేమా వెంకట్రావ్

భూమి-సేకరణ- పునరావాసం-స్త్రీలు

భూమి-సేకరణ- పునరావాసం-స్త్రీలు

హేమ
జార్ఖండ్‌లో భూనిర్వాసితుల పోరాటానికి మద్దతుగా నిల్చిన సిస్టర్‌ జాన్‌ వల్సను మైనింగ్‌ మాఫియా హతమార్చిందని వార్తాపత్రికలో (18.11.11) చూసి హతాశురాలినయ్యాను. భూవనరులను ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా బహుళజాతి కంపోనీలకు దోచిపెట్టకుండా ప్రజలతో కలిసి జాన్‌వల్స పోరాడింది. భూమి నుండి స్త్రీలను వేరు చేయడానికి దానిపై ఆధిపత్యానికి పురుషాధిక్య వ్యవస్థ ప్రయత్నిస్తున్నా స్త్రీలు ప్రతి భూపోరాటంలో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నారు. కాని వారి మనోభావాలు, ఆవేదన పాలకవర్గాల నిర్ణయాధికారంలో చోటు చేసుకోలేదు. ఫెడరిక్‌ ఏంగిల్స్‌ అన్నట్టు ‘ప్రపంచ మహిళలు చారిత్రక ఓటమికి గురయ్యారు’ ఈ నేపథ్యంలో జాతీయ భూసేకరణ పునరావాసం బిల్లు ఒకసారి పరిశీలిద్దాం.
పట్టణీకరణ-పారిశ్రామికాభివృద్ధి, వాటి మౌలిక సదుపాయాల కల్పన పేరుతో మూడింట రెండొంతులు స్త్రీలు పాల్గొనే గ్రామీణ వ్యవస్థను విచ్ఛిన్నం చేసి కార్పొరేటు సంస్థలకు భూమిని అప్పగించడానికి ప్రభుత్వం పూనుకుంది. వలస పాలనతో 1894లో చేసిర భూసేకరణ చట్టానికి ప్రతిగా ఈ చట్టం రాబోతుంది. ప్రజల్నుంచి ఎలాంటి అడ్డంగి లేకుండా ప్రభుత్వం చేపట్టే ప్రాజెక్టులను భూ సేకరణ జరపవచ్చు. ప్రేవేటే కంపెనీల కోసం అయితే 80% అనుమతి వుంటేచాలు. కాని ఈ 80%లో ఎంత మంది స్త్రీలు పట్టాదారులు? దళిత బహుజన వర్గాల్లో భూమి సాగుకు స్త్రీలే అధికంగా పాల్గొంటారు. యిక 20% మంది నిర్ణయాలు అసలు పరిగణనలోకి రావు. భూమి విలువను కట్టేదపుడు మార్కెట్టు వ్యవస్థ, దాని వినియోగం బట్టి ధరను నిర్ణయిస్తున్నారే తప్ప స్త్రీల అభిప్రాయాలకు తావే లేదు. స్వాధీనం చేసుకునే భూమి 100 ఎకరాలు మించితేనే సామాజిక పర్యవసానం గురించి ఈ బిల్లు మాట్లాడుతుంది. అంతకంటే తక్కువైతే ఈ భూ యజమానుల సంగతేమటన్న దానికి జవాబు లేదు. నీటివనరుల భూమి, బహుళ పంటలు పండే భూమి స్వాధీనపరుచుకోమని చెప్పినా కాకినాడ, సోంపేట, నందిగ్రాం తదితర ప్రాంతాల్లో ఏం జరుగుతుందో మనందరికి తెలుసు. భూ సేకరణకై గుర్తించబడ్డ స్థలాన్ని బాధిత స్థలంగా నిర్వచించారే కాని ఆ ప్రాజెక్టు ఉత్పత్తుల ఫలితంగా నష్టపోయే ప్రాంతాన్ని గుర్తించలేదు. దాని మూలంగా వెలువడే కాలుష్యం అనారోగ్య పరిణామాలు ప్రసక్తే లేదు. ఎవరి భూమిని సేకరించారో వారినే బాధితులుగా గుర్తించారే తప్ప వ్యవసాయ కూలీలు, వృత్తిదారులు, కౌలుదార్ల వర్గం, వారి స్త్రీల గురించి ప్రస్తావన లేదు.
భూమి ఒక వనరుగా కాక ఒక వస్తువుగా మారినక్రమంలో భూవనరులను పోగొట్టుకోవడమే కాకుండా దానితో జీవనాధారమైన జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని పోగోట్టుకుంటారు. అప్పటివరకు శ్రామిక వర్గంగా వున్న స్త్రీలు కొత్త ప్రాజెక్టులలో స్థానం లేక మిగులు మనుషులుగా మిగిలిపోతారు. ఈ బిల్లు భూమికి సంబంధించిన పంచాయితీ ఎక్స్‌టెన్షన్‌  అయి షెడ్యూల్డ్‌ ఏరియాస్‌ చట్టానికి, 2006  అది హక్కుల చట్టానికి, గిరిజనులు అధికంగా వుండే 5వ షెడ్యూల్‌ ప్రాంతంలోని భూముల బదలాయింపు చట్టానికి లోబడి వుంటుందని పేర్కొన్నా వాటి అతిక్రమణ అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది.లోక్‌సభ ఎన్నికల్లో ఆహార రక్షణ, భద్రత అనేది యు.పి.ఏ కూడమి ప్రజలకు యిచ్చిన వాగ్ధానం. అందుకు మరింత భూమిని సేద్యానికి వినియోగించకుండా ఉన్న భూమిని పారిశ్రామీకరణ పేరుతో కంపెనీలకు బదలాయిస్తున్నారు. దేనికి అనువుగానే ప్రజల్ని మభ్యపెట్టడానికి ఆహారాన్ని బదులుగా నగదు చెల్లిస్తామని ఆహార భద్రతా చట్టాలలో పేర్కొన్నారు. దీనివలన ప్రజాపంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేసి చిల్లర వ్యాపారంలో కూడా విదేశీ బహుళజాతి కంపెనీలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం పూనుకుంది. యిప్పటివరకు కాస్తో కూస్తో అందుతున్న కుటుంబాలకు అందదు.
యిక ‘పునరావసం’ ఒక రాజకీయ అవసరంగా గుర్తించి జాతీయ విధానాన్ని పొందుపరిచారు ఈ బిల్లులో. భూమి విలువతో పాటు యిల్లు, 20 వ సంవత్సరాలు రెండు వేల రూపాయల చొప్పున అందిస్తారు. కుటుంబంలో ఒకరికి ఉపాధి లేనట్లయితే 2 లక్షల రూపాయిలు యివ్వబడతుంది. రవాణాఖర్చులు, సెటిల్‌మెంటు, తాత్కాలిక ఉపశమన గ్రాంటు, పశుశాల, చిన్న దుకాణాల నిర్మాణం చేపడతారు. భూ విలువలో 25% షేర్లరూపంలో యివ్వబడుతుంది. యిల్లు భార్యభర్తల పేరు మీద యివ్వొచ్చు కాని యివ్వాలన్న నిబంధనలేదు ప్రభుత్వం నుంచి కల్పింపబడిన ఏ నష్టపరిహారమైనా, సదుపాయాలైనా పితృస్వామ్య వ్యవస్థలో ఎటువంటి పోరాటం చేయకుండానే పురుషునికి దక్కుతాయి. పురుషులు వస్తు వినిమయ వ్యామోహంలో పడి ఆ డబ్బును ఖర్చు చేస్తున్నారు. కొన్నాళ్ళ తరువాత డబ్బు యిబ్బందితో వాటికి అమ్మి సరైనా ఉపాధి దొరకక మరింత పేదరికంతో కూరుకుపోవడం కాకినాడ సెజ్‌లో అనుభవమే. ఆదివాసి సమాజంతో, సహా నష్టపరిహారాన్ని  విందులు, వినోదాలు, తాత్కాలిక అవసరాలకే హెచ్చిస్తున్నారు.
ప్రజాభిష్టం, కుటుంబాలపై సాంఘిక, ఆర్థిక అంశాల ప్రభావం, భూపరిధి తదితర అంశాలపై అధ్యయనం కోసం కమిటీ ఏర్పాటు చేసినా అందులో స్త్రీలు ఉండాలన్న నిబంధన లేదు. దేశ జనాభాలో మూడింట ఒక వంతు జనాభావున్న అసంఘటిత కార్మికులు దేశానికి రెండొంతుల ఆదాయాన్ని అందిస్తున్నారు. అధిక శాతం వీరిలో వ్యవసాయ, అనుబంధిత మహిళా కార్మికులే.
ఈ మొత్తం క్రమాన్ని పరిశీలించినట్లయితే స్త్రీలను భూమిక, దాని వనరులు నుండి గెంటివేసి ఆర్థిక స్వాతంత్య్రం కోల్పోయేలా చేస్తుంది. పితృస్వామిక భావజాలం ఉన్న సమాజంలో పురుషుల హింస ఈ పేట్రేగి కుటుంబభారం మొత్తం స్త్రీమీద పడుతుంది.కాబట్టి దేశాన్ని కబళించబోయే ఈ భూసేకరణ బిల్లులో మానవీయ ముఖ్యంగా స్త్రీకోణం లోపించింది. అత్యవసర పరిస్థితులలోనే భూసేకరణ పరిమితులతో జరగాలి. భూమికి భూమి యితర సదుపాయాలు కల్పించాలి. కుటుంబాన్ని యిద్దరి కలయికగా కాకుండా పితృస్వామ్య భావజాల ప్రభావిత యూనిట్‌గా గుర్తించి స్త్రీలకు ప్రాధాన్యం యివ్వాలి. స్త్రీలను ఉత్పత్తి చేసే మనుష్యులుగా చూసి శ్రమ ఆధారిత పరిశ్రమలు ప్రభుత్వ పరంగా తెరవాలి. వికేంద్రీకరణ, వనరులు, స్థానిక సాంకేతిక నైపుణ్యం ఉపయోగించుకొని నడిపే పరిశ్రమలు కోసం ఉద్యమించాలి. భూమిని వాటి వనరులను బహుళజాతి కంపెనీలకు దోచిపెట్టడానికి రూపొందించబడిన భూసేకరణ పునరావసం పునర్మిర్మాణం బిల్లు 2011ను వ్యతిరేకించడం పురుషుల కంటే దేశపౌరులుగా మనదే ఎక్కువ బాధ్యత!!

సూఫీ భిక్షుకి ఆమె!

సూఫీ భిక్షుకి ఆమె!

హేమ
కడివెడు కన్నీళ్ళను దాచుకుంటూ శిథిలమైన జీవిత అఖండ శకలాలను ఏరికూర్చి జీవన బీభత్స చిత్రాన్కి వన్నెలను అద్దుకోవాలని కుటుంబం నుండి సమాజ సంక్షోభ అంచులకు చేరుతుంది సూఫీ భిక్షుకిలా ఆమె. ఆమె ఎవరో కాదు సంఘటిత, అసంఘటిత అసలు కారణాన్కి చెందక ప్రభుత్వ దమననీతికో, విదేశీవిదేశాల విధ్వంసానికో లేక దాతృతృప్తి లోగిలిలో పురుడు పోసుకున్న ‘స్వచ్ఛంద సంస్థల’ కార్మికబిడ్డ.
వేకువనే లేచి వంటిల్లు అనే యుద్ధక్షేత్రంలో గెలుపు ఓటమిలకు సంబంధం లేనట్లుగా పోరాడే ప్రతిదీ అమర్చి పరుగులాంటి నడకతో సంస్థకు చేరుతుంది. అక్కడ మహిళా సాధికారత, పేదరిక నిర్మూలనా పథకాల కాడినెత్తుకొని నడుస్తున్న ఆమెకు పక్కింట్లో వదిలేసిన పాపాయి రోదనలు, రాత్రి మీటింగుల తర్వాత యింటికెళ్తే భర్తపెట్టే శారీరక మానసిక చిత్రహింస పరంపరలను, మనసు చేసే పోరాటాన్ని ఫైళ్ళ రూటున దాచేసి అలంకరించిన గానుగెద్దులా నడిచిపోతుంది. ఆమె కనపడనిది ఎక్కడ? 60, 70 దశకాలలో మొదలైన సంక్షేమ సంస్థలలో, 80వ దశకంలో అభివృద్ధి పథకాల హోరులో, తొంభైలలోని దళిత, స్త్రీవాద సంఘాలలో ఆపై ప్రపంచీకరణ నేపథ్యంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న హక్కుల సంఘాలలో, పన్ను ఎగవేతలో భాగంగా కార్పోరేటు సంస్థలు సృష్టిస్తున్న ట్రస్ట్‌లలో ఆమె మనకు తారసపడుతుంది.
ఏది ఏమైతేనేమి! ఆమె ఒక ఒంటరి అడ్డా మాలి  ! ఆమె ఏ సంఘటిత, అసంఘటిత రంగాన్కి చెందినది కాదు. ఏ యూనియన్లు, సైద్ధాంతిక మేధావులు ఆమె అశ్రువులను తుడచి ‘మేమున్నామ’ని ముందుకు రాలేదు. శతాబ్ది లక్ష్యాలు విజన్‌ 2020, దేశం వెలుగు పోతుందని చెప్పిన జాతీయ విధానాలు ఆమెను పరిగణలోకి తీసుకోలేదు. చట్టాలను అవపోసన చేసి అన్యాయాన్ని ఎదురించమని ప్రజల్ని సంఘటితపరిచే ఆమె ఏ చట్టం పరిధిలోకి రాదు. ఏవీ కొన్ని అతికొన్ని సంస్థలలో తప్ప పి.ఎఫ్‌. వైద్య సదుపాయాలకై ఇ.ఎస్‌.ఐ. లాంటి అసంఘటిత కార్మికుల చెందే విధానాలు లేవు. జీతాల్లో తారతమ్యాలు, కోతలు, అవమానాలు, లైంగిక వేధింపులు సర్వసామాన్యమే! ఉద్యోగభద్రత వారి ఊహకందనిదే. పోరాటాలు తప్పితే పే కమీషన్లు, పెన్షన్లు వారి లోగిల్లో విశ్రాంతి తీసుకోవు. కనీసం ఏ కంపెనీలో పనిచేసినా నాలుగు డబ్బులు వెనుక వేసుకునే ఇతర అసంఘటిత స్త్రీల జీవనభద్రత కంటె వీరి భద్రత ప్రశ్నార్థకమే! ఏ క్షణాన యాజమాన్యపు క్రీనీడపడివున్న కాస్తంత ఆసరా పోతుందనే విషాదం మాటున ప్రజాస్వామ్య సాక్షిగా బతుకీడుస్తుంది. పనిచేసేచోట లైంగిక వేధింపుల నిరోధక చట్టం ముసాయిదాలో కూడా ‘ఆమె’ మనకు కన్పించదు. స్త్రీల పట్ల ఎన్నెన్నో గణాంకాలు, సాధికారత అభివృద్ధి కొలతలు! కాని ఆమె ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే చేతికందొచ్చిన పచ్చటి పంటపొలం మీద కట్టివేయబడ్డ దిష్టిబొమ్మలా బతుకు దృశ్యం వెక్కిరిస్తూనే వుంటుంది!
పొట్టచేత పట్టుకొని 8 గం||లకు పైగా, వివిధ సమయాల్లో పనిచేసే ఆమెను స్వచ్ఛంద కార్యకర్తగా పిలుస్తారే తప్ప ఒక కార్మికురాలిగా గుర్తించరు. ఇందులో ఎన్నో రకాలు! ప్రొఫెషనల్‌, నాన్‌ప్రొఫెషనల్‌, వాలంటరీ సోషల్‌ వర్కర్లు యిలా ఏవేవో పేర్లు. పనివిధానం వేరు కావచ్చు కాని బాధ్యతలు ఒక్కటే. ప్రొఫెషనల్‌ సోషల్‌ వర్కర్లకు ఒకటి రెండు సంఘాలు వున్నా అందులో ఎంతమంది వున్నారు? వాటి లక్ష్యాలు, జరుగుతున్న న్యాయం ఏమిటి అన్నది ఆ కోర్సు చదివిన చాలామందికే తెలియదు. యికపోతే నిరంతరం ప్రజల్ని సంఘటితపరిచే ప్రక్రియలో తలమునకలై అటు పితృస్వామ్య భావజాలాన్కి, ప్రపంచీకరణలో అత్యంత ఛీప్‌ లేబర్‌గా మారి సమిధలవుతున్న ఈ కార్మికురాలికి ఎలాంటి సంఘాలు లేవు. వ్యూహాలు, విధానాలు రచించి సమాజమార్పుని కోరి పిడికిలెత్తిన ఆమెకు తమ హక్కులపట్ల నడుంబిగించే అవకాశాలను ‘సేవాతత్పరత’ అనే పేరుతో మసిపూసి కావాలనే మొదట్నుంచి రంగం మూసివేసింది. దోపిడి భావజాలం గురించి మాట్లాడే తాము కూడా దోచుకోబడుతున్నామని తెలిసినా మౌనం ఎందుకు మౌనం వహిస్తున్నారు? తమ హక్కుల్ని తాము పొందలేని ఈ కార్మికులు ఏ సమాజ విముక్తిని కోరుతున్నారు? ఈ ‘సేవ’ ‘దాతృత్వం’ ‘స్వచ్ఛందం’ వెనుక దాగిన కుట్రలేమిటి?
భూమి, వనర్లు స్వంత ఆస్తిగా కాకుండా సమాజపరమై స్వేచ్ఛగా మనిషి వాడుకున్నంత వరకు ఈ ‘స్వచ్ఛంద లేదా దాతృత్వపు’ భావనలు ఏమి సంఘంలో లేవు. ఎప్పుడైతే మనిషికి స్వంత ఆస్తి, స్వలాభం మొదలయ్యాయో అప్పుడే సమాజం వర్గాలుగా విడిపోయి దోపిడి అణిచివేత మొదలయ్యింది. ఆ మూలాల నుంచి పుట్టుకొచ్చిన భావనలు ‘దాతృత్వం, సేవ’, తమ నిరంతర దోపిడి నిరాటంకంగా కొనసాగించడానికే ఆయా వ్యవస్థలు కనుగొన్న నయా సైద్ధాంతిక రూపకల్పనకి మారుపేర్లు. ఈ భావనలు ‘గ్లోరిఫై’ చేయబడి సమాజంలో ఆమోదింపచేసుకున్నాయి దోపిడి వర్గాలు. ఈ భావనలు అనేక రూపాలు ఎత్తుతున్నాయి కూడా! రూపమేదైనా సారం ఒక్కటే! పెట్టుబడిదారీ విధానం మార్కెట్టు కోసం పూర్ణరూపాలైన ప్యూడల్‌ భావజాలాన్ని మరింతగా ఉధృతం చేస్తుంది. యిక దాతృత్వపు మూస నుండి హక్కుల ముసుగులో ప్రపంచీకరణ పెట్టుబడి పేరుతో మార్కెటు కోసం పలు అవతారాలు ఎత్తుతుంది. ఈ మాయా పంజరంలో చిక్కుకుని విలవిలలాడుతున్న పక్షి వైనం ఈ స్వచ్ఛంద కార్యకర్త/కార్మికురాలిది.
మరోవైపు వ్యవసాయం, వృత్తులు కాపాడుకోవడం మొదలైన ప్రజా పోరాటాలు జల్‌, జంగిల్‌, జమీన్‌ వాటిలో దాగివున్న వనర్లు కాపాడుకోవడంకోసం చేస్తున్న పోరాటంగా మారుతున్నాయి. ఈ రోజు మార్కెటు భావజాలాన్కి అశేష ప్రజానీకాన్కి ఘర్షణ మొదలైంది. అందుకే ప్రజలు మార్కెట్టు శక్తులపై దాడి జరిపినప్పుడల్లా స్వచ్ఛంద కార్యకర్తలు గూడా ఈ దాడులకు బలవుతున్నారు. నిన్న, మొన్న జరిగిన అస్మిత, స్పందనల కార్యకర్తలపై దాడి కూడా ఇలాంటిదే. సోంపేట, కాకరాపల్లి సెజ్‌లలో అభివృద్ధి పథకాల పేరున గ్రామాలకు వస్తున్న కార్యకర్తలను కూడా తరిమికొడితే కంటినీరు నింపుకొన్నారు, ప్రభుత్వ దమననీతిలో పావులయ్యారు.
అందుకే ‘ఆమె’ బతుకు ‘ఈగ కథ’లా కాకూడదు. ప్రకృతి, వనర్లు, జీవనోపాధులను, కుటుంబాలను, వ్యక్తిత్వాలను, మానవ సంబంధాలను ధ్వంసం చేసే దాతృత్వపు మూలాలను ప్రశ్నించగలగాలి. ఈ వ్యవస్థచే ఉపయోగించబడి విసిరివేయబడుతూ ప్రాథమిక హక్కుల్ని కూడా కాలరాస్తున్న వ్యవస్థ మీదకి, ఆర్థిక, సామాజిక రంగాల ఆధిపత్య శక్తుల మీదకు ఆమె ఆగ్రహం మళ్ళించగలిగితే ఆమె అడవిబిడ్డే కాగలదు. భ్రష్టుపట్టిన, అవినీతికి మూలమైన, అధికార లాలసతో కూడిన స్వార్థపూరిత దాతృత్వపు నీడల నుంచి దాటితే అప్పటి వరకు వల్లెవేసిన ఐక్యతా, భాగస్వామ్యం, వ్యక్తిగత నిబద్దత నిజమైన ఆయుధాలు కాగలవు. సామాజిక స్పందన, సహానుభూతి కలిసిన నూతన మానవావిష్కరణ దిశగా పయనిస్తున్నవారితో చేయి కలిపితే ప్రజా ఉద్యమాలు మరింత అరుణిమ దాలుస్తాయి. అప్పుడే కదా దోపిడీ, పెత్తనం లేని స్వీయ విముక్తి గీతాన్ని కూడా విశ్వాసాల సారంగిపై సూఫీ భిక్షుకిలా ఆమె పాడగలదు!!

October

October 

మనసెరిగి…

మనసెరిగి…

హేమ
మనసా వాచా నిన్నే వలచా, నడిచా నీ నీడగా’.. ఇది  నేటి యువత పాట. ‘ధర్మేచ, అర్థేచ, కామేచా నాతి చరామి’ తరాలుగా మనతో చేయిస్తున్న పెళ్ళి బాసలు. అయితే యిపుడు ఈ గొడవంతా ఎందుకంటే బాబు?
ఈ మనసు, బాసల మధ్య మనమంతా ఎంత ఎదిగామనేది ఒక ప్రశ్నగానే మిగిలింది కాబట్టి. మనలో చాలామందికి నయనతార పేరు తెలిసే వుంటుంది. తెలుగు సినిమాలో హీరోయిన్‌గా నటించింది. మంచినటి అనడంలో సందేహం లేదు.  ఆమె అసలు పేరు నయన మరియం కురియన్‌.  క్రైస్తవ మతస్థురాలు. అయితే ప్రభుదేవా అనే సహనటుడితో  ప్రేమ, పెళ్ళి నేపథ్యంతో ఇటీవల హిందుమతంలోకి మారిపోయింది. పత్రికలో ఈ విషయం చాలా ప్రముఖంగా వచ్చింది. అయితే ఆమె మతం మార్చుకోవడం తన ఇష్టం. రాజ్యాంగం కల్పించిన హక్కుకూడా అనొచ్చు కాని సాధారణంగా మనిషి తన  తన ఉన్నతి కోసం మార్పును ఇష్టపడడటం జరుగుతుంది.   మరి ఏ ప్రగతిని ఆశించి నయనతార  హిందూ మతంలోకి మారిందో! ఈ దేశంలో తరతరాలుగా హిందూ మతంద్వారా అణిచి వేతలో  నలిగిపోయిన పేద దళిత బహుజన వర్గాలు తమ విముక్తికోసం క్రైస్తవ మతంలోకి, ఇస్లాం మతంలోకి మారారన్నది  చారిత్రక వాస్తవం. అయితే ఆ లక్ష్యం ఏ మేరకు నేరవేరిందన్నది వేరే చర్చ.
వేదాలు, గాయత్రి మంత్రం  స్త్రీలు చదవకూడదని అలా చేస్తే వారి  నాలుక కోసేయమని, వింటే వారి చెవుల్లో సీసం పోయమని ఆదేశించిన మతంలోకి నయనతార ఎలా వెళ్ళందో! దళితులను, శూద్రుల్ని టార్గెట్‌ చేసి ఊడిగం చేయించుకొని ఎదురు తిరిగితే రక్తపుటేర్లను ప్రవహింపచేసిన బ్రాహ్మణ మతం ఎందుకు నయనతారకు శరణ్యం అయ్యిందో!.  ఇదంతా తనకు తెలిసే జరిగిందా? ఎవరైనా బలవంతంగా రుద్దారా అనే విషయాలు మనకైతే యిదమిద్దంగా తెలియవు. వారి వ్యక్తిగత విషయాలు మనకెందుకని వదిలేసినా నయనతార ‘ఒక సెలబ్రెటి’ ఆమె చర్యలు సామాన్య స్త్రీలపై తప్పక ప్రభావం చూపిస్త్తాయి.నయనతారను సీతమ్మవారుగా బాపు ‘రామరాజ్యం’ లో ప్రాణం పోసాడు. మనకు ఇప్పుడు నయనతార అంటే అపర సీతమ్మవారు. మళ్ళీ మనవాళ్ళలో కొందరైనా సీతమ్మవారి కష్టాలు చూసి కన్నీళ్ళు పెడతారు. స్త్రీల చైతన్యం కొంతమేరకు పెరుగుతున్నప్పుడల్లా మధ్య మధ్యలో తిరిగి సీతమ్మతల్లిని ఆదర్శంగా తెరమీదకు తీసుకొస్తుంటారు. నయనతారలాంటివాళ్ళు హిందూ మత ప్రస్థానం కూడా ఆ విషయాన్నే నొక్కి చెప్పుతుంది.
నయనతార  మత మార్పిడి విషయంలో రెండు విషయాల గురించి మనం ప్రధానంగా ఆలోచించాలి. స్త్రీలపై ఇప్పటికీ పనిచేస్తున్న పితృస్వామిక భావజాలం మరియు మొత్తంగా  ‘హైందవీకరణం’  చేయబడుతున్న భారతసమాజం గురించి.  మనదేశంలో ప్రతి మనిషికి తనకు ఇష్టమైన మతాన్ని ఎంచుకునే హక్కును రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 25(ఏ) కల్పించిందికూడా. కాని ఈ విషయాన్ని అగ్రవర్ణ, వర్గ భావజాలాన్ని నరనరాన జీర్ణించుకొన్న పురుష సమాజం ఏనాడు ఒప్పుకుంది కనుక! గుజరాత్‌లోని ముస్లిం స్త్రీలపై దాడులు, ఒరిస్సాలోని కాందమాళ్‌లో ఆదీవాసీలపైన జరిగిన దహనకాండ, మంగళూరు క్రైస్తవ స్త్రీలపై భౌతిక, సాంస్కృతిక దాడులు, ఉత్తరప్రదేశ్‌లోని నన్‌పై (కైస్తవ సన్యాసినులు)అత్యాచార అత్యాచారం దీనికి అద్దం పడతాయి.
ప్రపంచీకరణ నేపథ్యంలో పెట్టుబడిదారి వర్గాన్ని, మార్కెట్టు విస్తరణే ముఖ్యం. మెజార్టీ మతం ఏదైతే వుందో దానిలో కలిసిపోవాల్సిన అవసరం ఈ అంతర్జాతీయ పెట్టుబడిదారి వర్గాలకు వుంటుంది. ఈ వ్యవస్థలోని సామాజిక నిర్మాణాలతో రాజీ చేసుకుంటుంది. ఈ క్రమంలో సెక్యులరిజం(లౌకికం)పోయి లౌక్యం వస్తుంది. సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ వర్గం తమ మనుగడకోసం, హిందువులు, ముస్లింలు లేదా క్రైస్తవులు మైనార్టీలుగా, గుంపులుగా విడదీయడం, విఢజించు, పాలించు సూత్రాన్ని రాజ్యంతో అమలు చేయిస్తుంది. వాళ్ళు దేశంలోని ప్రధాన వర్గాన్ని తయారు చేసుకొని ఆఖరికి పెట్టుబడులను కూడా హైందవీకరణచేస్తున్నారు. (ఆర్‌.ఎస్‌.రావు-కొత్తచూపు)  అడ్డొచ్చిన వారిపై అటాక్‌ లేదా వారిని కో అప్ట్‌ (సంలీనం) చేసుకోవడం హిందూ మత లక్షణం. ఈ పెట్టుబడిదారులు హిందుత్వంద్వారా తమకు అనువైన మార్కెటును ఏర్పాటు చేసుకుంటున్నారు.  కాబట్టి  యిక్కడున్న అధికార (భారతదేశం సెక్యులర్‌ స్టేట్‌ అంటారేమో. క్షమించండి!) మతానికి రాజ్యానికి దానికనుబంధమైన అంగమైన ప్రెస్‌కు అవినావభావ సంబంధం వుంది. యిన్ని హంగులన్న అంతర్జాతీయ పెట్టుబడిదారీ వర్గం దేశంలో తాము తయారు చేసుకున్న ఒక దళారీవర్గంలో మొత్తం సమాజాన్ని హైందవీకరణ చేయడానికి ప్రయత్నాలు ముమ్మురంగా జరుగుతున్నాయి. ఈ హిందు మతోన్మాదాన్ని మెజార్టీ-మైనార్టీ అనికాకుండా ఏకశిలా సంస్కృతిని ముందుకు తీసుకువస్తున్నారు.
అందుకే రాజ్యం ఈ రోజున  మీడియా సహకారంతో నయనతార మత మార్పిడిని గ్లోరిఫై చేస్తే కథనాలు ప్రచారం చేస్తుంది. ఆమె వ్యక్తిగత విషయాన్ని సమాజంపై ప్రభావం పడేలా చేయడం వెనుక కుట్ర దాగివుంది. మరో విధంగా స్త్రీ ఏవర్గానికి, కులానికి, మతానికి చెందినదైనా పురుషుడికోసమే ‘ఆమె’ జీవితం అనే ఒక పితృస్వామ్య భావజాలాన్ని మరింతగా మరింత బలపడేలా చేయడానికి  ఈ వర్గాలు  ప్రయత్నిస్తున్నాయి.  మొత్తం భారత సమాజాన్ని  హైందవీకరణ చేసి తమ పెట్టుబడులకు, లాభాలకు ఢోకా లేకుండా చేసుకొనే ప్రయత్నమే మైనార్టీలపైన దాడులు, లేదా  మెజార్టీ హైందవీకరణ చేసి తమ పెట్టుబడులకు లాభాలకు ఢోకా లేకుండా చేసుకునే ప్రయత్నానికి మైనార్టీలపైన దాడులు లేదా మెజార్టీ మతం తీసుకున్న వారిపై అత్యంత ప్రేమాభిమానాల పబ్లిసిటీ.  ఈ దేశంలో వుండాలంటే జైశ్రీరామ్‌ అనాలన్న నినాదంతో బాబ్రీ మసీదు కూల్చివేత, మైనార్టీలపై హింసా, అల్లర్లు, స్త్రీలు అని కూడా చూడకుండా వారిపై టెర్రరిస్టుల ముద్ర వేస్తున్న ధోరణులు, ప్రయత్నాలు మనందరి జీవనభద్రతకే ముప్పు. ‘మనసెరిగిన మన కథలో(వ్యధలో) ఎన్ని సామాజిక  కోణాలు వున్నాయి. సామ్రాజ్య వాద కుట్రలు దాగి వున్నాయి. కాబట్టి పరమత స్త్రీలను ఉన్నామదంతో ఊచకోత కోసి, ‘నస్త్రీ స్వాతంత్య్ర మర్హతి’ అని ఘోషించే హైందవ మతంలోనికి వెళ్ళే కాని నయతారలే కాకుండా స్వేచ్ఛకోసం మతన్మోదానికి వ్యతిరేకంగా పోరాడే  తస్లీమా నస్రీన్‌లు మనకు ఆదర్శం కావాలి.

August

August 

అభివృద్ధి వెలుగునీడల్ని ఆనాడే చూపించిన ఆర్‌ఎస్‌రావు

అభివృద్ధి వెలుగునీడల్ని ఆనాడే చూపించిన ఆర్‌ఎస్‌రావు

హేమ
అణగారిన వర్గాలకోసం అహర్నిశం పట్టించుకొనేవారు ఒక్కరొక్కరుగా రాలిపోతున్న సందర్భం ఇది. కన్నాభిరాన్‌, బాలగోపాల్‌, బుర్రరాములు,  పతిపాటి వేంకటేశ్వర్లు… ఇప్పుడు ఆర్‌ఎస్‌రావు (రేగులగడ్డ సోమేశ్వరరావు)  తెలుగువాడే కాని ఒరిస్సాలోని  బుర్ల యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేసారు. అయిన ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలను, ఉద్యమాలను సాహిత్యాన్ని ఎప్పుడు విడిచిపెట్టలేదు. అతడు రాసిన ”అభివృద్ధి-వెలుగు నీడలు” ఒక అద్భుత రచన. అభివృద్ధి గురించి ఇప్పటికే జరుగుతున్న చర్చకి 1990లోనే శాస్త్రీయ సమాధానాన్ని వివరించి చెప్పిన ఆర్‌ఎస్‌రావును ఏ ఉద్యమకార్యకర్త మర్చిపోరు.
ఆర్‌ఎస్‌రావు అంటే ”అభివృద్ధి వెలుగునీడ” అనేవిధంగా గుర్తుండిపోయారు. ఆ తర్వాత కూడా అనేక విషయాల మీద ఆయన చేసిన రచనలు మనకు ఒక స్పష్టమైన అవగాహనని కల్పించే విధంగా వుంటాయి. కాబట్టి అతడ్ని గుర్తు చేసుకోవడం అంటే అతడి రచనల్ని మరొక్కసారి మననం చేసుకొని ముందుకు సాగిపోవడమే.
మీరు ఆనకట్టలకి, విద్యుత్‌కేంద్రాలకు, రోడ్లనిర్మాణాలకి వ్యతిరేకంమా? అంటే ”అభివృద్ధికి వ్యతిరేకులు” అభివృద్ధికి వ్యతిరేకులంటే ద్రోహులు అనే స్థాయికి వెళ్ళిపోయాయి మనలో కొందరి బుర్రలు, ఆ బుర్రలు బూజు వదలగొట్టాలి అంటే” అభివృద్ధి వెలుగు నీడల” గురించి లోతుగా చర్చించాల్సిందే. అభివృద్ధి  గురించి  ఆర్‌.ఎస్‌.రావు మాటలోనే” ఏ ఉత్పత్తి శక్తుల పెరుగుదల అయినా దాని వెనుక నిబిడమయి ఉన్న మానవ శ్రమ, విజ్ఞానాల ఫలితం. ఆ విజ్ఞానం ఒకనొక ప్రాపంచిక దృక్పధం కారణంగా జనిస్తుంది అంటే ఏ రూపంలో కన్పించే అభివృద్ధి పథకం అయినా అంతిమ పరిశీలనలో ఒకానొక ప్రాపంచిక దృక్పథం  నుండే పుడుతుంది. అందుచేత ఆయా అభివృద్ధి పథకాల సారం వాటికి కారణం అయిన  ప్రాపంచిక దృక్పథమే  అని చెప్పుకోవాలి. అలాంటప్పుడు ఆనకట్టనో ఫ్యాక్టరియో కాలేజినో అభివృద్ధో కాదో తెలుసుకోవాలంటే ఆ అభివృద్ధి పథకం ప్రాపంచిక దృక్పథంలో ఏమైనా మార్పులు తీసుకు వచ్చిందా, లేదా, అప్పటికే బలంగా వున్నా వేరొక ప్రాపంచిక దృక్పధంలో తానే ఒక భాగం అయి పోయిందా అనే అంశాన్ని పరిశీలించాలి. ప్రాపంచిక దృక్పథం అంటే ఏమిటి? నిర్ధిష్ట దేశకాల పరిస్థితుల్లో మనిషికీ ప్రకృతికీ మధ్య గల సంబంధాన్ని లేదా వైరుధ్యం గురించి తెలియజేపే దృక్పథమే ప్రాపంచిక దృక్పథం…
అభివృద్ధి అనే భావన ఏకకాలంలో క్లిష్టం అయినది సులభంగా  అర్ధమయ్యేది కూడా. సులభంగా ఎందుకు అర్ధం అవుతుందంటే దాని బలమైన దర్శనీయత వల్ల (విజుబ్యూలిటీ) క్లిష్టమయినది ఎందుకు అంటే దాని వెలుతురిని అర్ధం చేసుకోగలిగినంత సులభంగా అది సృష్టించే నీడల్ని అర్ధం చేసుకోలేం కాబట్టి.
అయితే అభివృద్ధిసారం దాని భౌతిక రూపంలో కాక ఆ అభివృద్ధి సాధ్యం చేసిన ప్రాపంచిక దృక్పథంలోనే ఉందని సులభంగానే అర్ధమముతుంది. అందుకే భయంకరదుర్ఘటన  జరగక ముందు భోపాల్‌ యూనియాన్‌ కార్భిదే అభివృద్ధికి ప్రతీక. ఆ సంఘటన తర్వాత ఆ భావం బీటలు వారింది.అభివృద్ధి వెలుగు నీడలు ఒక మంచి వ్యాసం అయితే దాన్ని ఒక జీవితంద్వారా చెప్పగలిగిన రచయిత కాళీపట్నం రామారావుగారు. అతడి యజ్ఞం కథ గురించి రాస్తూ గొప్ప విశ్లేషణ చేసారు.
యజ్ఞంకథలో గాంధీజీ ఆశయాలతో ప్రభావితం అయినా శ్రీరాములు నాయుడు గ్రామాభివృద్ధికి రోడ్లు స్కూలు ఏర్పాటు చేస్తాడు. రోడ్ల ద్వార మోటారు వాహనాలు వచ్చి రిక్షాలను మూల పడేశాయి. వ్యాపార పంటలు వలన సంప్రదాయ రీతులు నష్టపోయి అప్పులు పాలవుతారు. ఈ నేపధ్యంలో అప్పలరాముడు అప్పు తగువే ఈ కథ. ఈ తీరని అప్పులు వలన తనలాగే తన కొడుకును బానిస కావడానికి వీలు లేదని తన కొడుకును చంపేసి అప్పల రాముడు పంచాయితీ ముందు పడేస్తాడు.
గ్రామజీవితంలో అభివృద్ధి క్రమం ముందు శ్రీరాములు నాయుడు హీరోగా మొదలుపెడితే కథ అంతానికి అప్పలరాముడు అంటే హీరో నుంచి హీరో అయిపోతాడు. ఇంకా వర్గం రూపొందని కాలంలో అప్పల రాముడు అ వర్గ ప్రతినిధిగానే వర్గ సహకారం లేకుండా ఉండిపోయాడు. కాని ఆ తర్వాత కాలానికి వర్గ పోరాటాలద్వారా వర్గం రూపొందటం మొదలయింది. సంఘర్షణ ప్రదానం అయ్యింది. ఆ మార్పులో నూతన దృక్పథం కనిపిస్తుంది. ఇది ఎటువంటి  అప్పు అనే ప్రశ్న కాకుండా దానికి ఒక సమాధానం ఇస్తుంది. ఇది ఎటువంటి అభివృద్ధి అంటే ఏమిటి అనిఅంటే ఏమిటి అని చెపుతుంది. ఉద్యమం ప్రధానంగా ఉన్న గ్రామాలలోనే కాకుండా మిగిలిన ప్రాంతాలలో కూడా ఈ మార్పు కనిపిస్తుంది. రూపాలు వికృతం అవ్వచ్చును. అంటే నిజ జీవితం అంటే హీరో నుంచి ఆల్ట్రానేటివ్‌ హీరోకు మార్పు చెందింది. ఈ అల్ట్రానేటివ్‌ హీరో అట్టడుగు వర్గాల నుంచి అణగార్చబడ్డ ఆడవాళ్ళ దగ్గర నుండి ముందుకు వస్తున్నారు.
దేర్‌ ఇస్‌ నో ఆల్ట్రానేటివ్‌. ఈ అభివృద్ధి తప్ప వేరే దారి లేదు అని చెబుతూ సామ్రాజ్యవాద పెట్టుబడి దారి విధానం తన విధ్వంసకర కార్యక్రమాన్ని అణిచివేత విధానాలతో అమలు చేయ ప్రయత్నిస్తుంది. ప్రత్యామ్నాయం ఉందంటూ ప్రజలు ప్రతిఘటిస్తూనే వున్నారు వారి పక్షాన నిలిచిన ఆర్‌.ఎస్‌.రావు ప్రత్యామ్నాయరాజకీయాలను ప్రతిపాదించి మనందరికీ ”కొత్తచూపు”ను అందించారు.

మానవ హక్కుల కమీషన్‌ – మనం


మానవ హక్కుల కమీషన్‌ – మనం

హేమ
నమ్మిన సిద్ధాంతం కోసం చావునే లెక్క చేయకుండా నడిచిన బాటలో అతడు నేలకొరిగితే, కలల శకలాలలను మూట గట్టుకొని ఆశయాల సజీవ స్వప్నమై జనసంద్రంలో కలిసి జీవైక హక్కులకై పోరాడాలనుకుంటుంది  ”ఆమె” ఒక అక్క. హింసాహింసల మధ్య  సన్నటి పరదాలను తొలగించి చూస్తే పగిలిన జీవన దర్పణంలో అస్తిత్వం వెయ్యి ముక్కలై పకపకమని నవ్వుతుంది. ”ఆమె” ఒక ఇల్లాలు. గ్రీన్‌ హంట్‌లో భాగంగా సర్కార్‌ సైన్యాలు అడవి బిడ్డల్ని చేరబడితే న్యాయస్థానాల ముంగిటకు నడిచి వచ్చిన ”ఆమె”, వాకపల్లి. ప్రభుత్వఆసుపత్రిలో నీడలేక రోడ్డు మీదే ప్రసవించి, బిడ్డలను కోల్పోయే ”ఆమె” పేదరాలు. వీరందరూ, తమహక్కుల గురించి ప్రశ్నిస్తూన్న వాళ్లే. అయితే ఇంతకు మునుపులా కాకుండా వీరందరూ ‘మానవ హక్కుల కమీషన్‌’ కు రావడం కొత్త మలుపు. అందుకే ఈ మానవ హక్కుల కమీషన్‌ అంటే ఏమిటో తెలుసుకునే చిన్న ప్రయత్నమే ఇది.
రెండు ప్రపంచ యుద్ధాలు  మానవ జీవితంలో అంతులేని విషాదాన్ని, వేదనను మిగిల్చాయి. ఈనేపథ్యంలో మానవహక్కులను నిర్వచించడం ఆనాటి తక్షణకర్తవ్యంగా మారి విశ్వజనీన మానవ హక్కుల ప్రకటనకు దారితీసింది. మానవహక్కులంటే  ”భారతరాజ్యాంగంలోని ప్రాధమిక హక్కులలో పొందు పరిచి  అభయమివ్వబడిన వ్యక్తి జీవితం, స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సమానత్వం, గౌరవం లేక ఇంకా అంతర్జాతీయఒప్పందాలలో పొందుపరిచి భారతదేశ కోర్టులలో అమలు పరిచే అవకాశం వున్న హక్కులన్ని మానవ హక్కులే” అని గ్రాంథిక భాషలో చెప్పిన నిజానికి స్త్రీ జీవితంలో పెత్తనాన్ని వ్యతిరేకించేదే హక్కు. స్త్రీ తాను నమ్మినదానికై ఆత్మగౌరవంతో శ్రమించి బుద్దిబలంతో దోపిడీ వివక్షకు వ్యతిరేకంగా జీవించేదే మానవ హక్కు. అందుకే స్త్రీల హక్కులన్ని మానవ హక్కులుగా మనముందుకొచ్చాయి. కొన్ని  స్త్రీల ప్రగతికి బతికే హక్కుకి అడ్డంకులుగా మారినప్పుడు ఆ హక్కుల పరిరక్షణలో భాగంగా వాటిని త్రోసిపుచ్చే ప్రయత్నంలో  సంఘనియమాలను  చట్టాలను ఉల్లంఘిస్తే వాటికి వ్యతిరేకంగా పోరాడితే  అది జీవించే హక్కు వ్యక్తీికరణలో భాగంగా చూడాలి. అందుకే  బ్రతికేహక్కుకోసం అమలులో వున్న నియమాలను ధ్వంసం చేసే హక్కు ప్రతి స్త్రీ కలిగివుంటుంది.  అయితే ప్రశ్నల్లా వాటిని ఎక్కడ ప్రశ్నించాలా అన్నదే. అందుకు కొన్ని వ్యవస్థలను ఏర్పాటు చేసినట్లు రాజ్యం ప్రకటించింది.
వాటిలో భాగంగానే  మహిళా జాతీయకమీషన్‌, షెడ్యూల్డ్‌ కులాల, జాతుల జాతీయ కమీషన్‌, మైనారిటీ జాతీయకమీషన్‌, మానవ హక్కుల కమీషన్‌లు ఏర్పడ్డాయి. ఈ మధ్య  మనం  మహిళ కమీషన్‌కంటే  మానవ హక్కుల కమీషన్‌ కొన్ని  సామాజిక పొరపాట్లపై ప్రతిస్పందించడం గమనిస్తాం! (అవి ఏమేరకు న్యాయం చేకూర్చనప్పటికీ కూడా..) ఇదే మానవ హక్కుల కమీషన్‌ స్త్రీల హక్కులకై చేస్తున్న కృషిని పరిచయం చేయడానికి ప్రయత్నిస్తాను. మానవ (స్త్రీల) హక్కుల ఉల్లంఘన కమీషన్‌ దృష్టికి వచ్చినప్పుడు కమీషన్‌ తనకుతానుగా గాని, బాధితులుగాని, బాధితుల తరఫునగాని ఎవరైన ఫిర్యాదు చేసినప్పుడు కమీషన్‌ విచారిస్తుంది. ఏదైనా కోర్టులో విచారణలో వున్నప్పుడు ఆ కోర్టు అనుమతితో కమీషన్‌ స్త్రీల హక్కుల విషయంలో జోక్యం కలుగజేసు కోవచ్చు. జైళ్ళను అదేవిధంగా వ్యక్తులను చికిత్సకోసం, సంస్కరణలకోసం, రక్షణకోసం సంబంధించిన ఇతర ప్రభుత్వ సంస్థలను దర్శించి అక్కడ నిర్భంధంగా వున్న వ్యక్తుల బాగోగుల గురించి, స్థితిగతుల గురించి అధ్యయనం చేసి వాటి మెరుగుదలకు కావలసిన చర్యలు చేపట్టవచ్చు. అవసరమైతే నష్టపరిహారాన్ని ఇప్పించవచ్చు. మానవ హక్కుల భావవ్యాప్తికై సాహిత్యాన్ని అందరికీ అందేటట్లు చేయడం, సెమినార్‌లు నిర్వహించడం మీడియాద్వారా కృషిచేయడం చేస్తుంది.
సాధారణంగా కమీషన్‌లు పితృస్వామ్యం, కులస్వామ్యం, ధనస్వామ్యం చేసే ఉల్లంఘనలకంటే పోలీసుహక్కుల ఉల్లంఘనకై కమీషన్‌లో వ్యాజ్యాలు వేస్తుంటారు. సమాజంలో వున్న శక్తివంతమైన గ్రూఫులు పాల్పతున్న  మానవ హక్కుల ఉల్లంఘన  విచారణపై కమీషన్‌ సామర్థ్యంపై ప్రజలకు అనుమానం వుంది. (నిజానికి ఎంతోమంది స్త్రీలకు ఈ కమీషన్‌ గురించి తెలియదు) ఇంకో విషయం ఏమిటంటే  మానవ హక్కు ఉల్లంఘనకు పాల్పడుతున్న పబ్లిక్‌ సర్వ్‌ంట్‌లే కాదు ప్రేక్షక పాత్ర వహించేవారు కూడా ఉల్లంఘనకు బాధ్యులవుతారు. క్రిమినల్‌ ప్రొసిజర్‌ కోడ్‌లోని 26వ ఛాప్టర్‌ సె.195 ప్రకారం కమీషన్‌ను  సివిల్‌ కోర్ట్‌గా పరిగణిస్తారు. ఈ కమీషన్‌కు బాధితులకు, బాధితకుటుంబాలకు సత్వర న్యాయసహాయం అందజేయడానికి సిఫారస్సు చేయడానికి మాత్రమే అవకాశం వుంది. అంతేకాని ఆదేశించే అవకాశం అధికారం లేదు. అంటే కమీషన్‌ అధికారానికి నియంత్రణ వుంది. అదే విధంగా ఉల్లంఘనలకు పాల్పడిన వ్యక్తులపై తగినచర్యలు తీసుకోమని సిఫారస్సు మాత్రమే  కమీషన్‌ చేయగల్గుతుంది.ఈ సిఫారస్సుపై ప్రభుత్వ చర్యలు తెలియజేయాలి. కమీషన్‌ రిపోర్ట్‌లు ఉభయ సభలకు అందజేయపడ్తాయి. దీనివలన ప్రజల నిరసనని ప్రభుత్వాన్ని గురి చూసే అవకాశం వుంది. సాయుధదళాలు స్త్రీలపై జరిపే హక్కుల ఉల్లంఘనపై  కేంద్రప్రభుత్వం నుంచి  రిపోర్టు రాకపోయిన సంతృప్తి చెందకపోయినా విచారణ జరపడానికి అవకాశం లేదు.( మానవ హక్కులు – మంగారి రాజేందర్‌) మానసిక బాధిత స్త్రీలపౖౖె జరిగిన సంఘటన ఈ నేపథ్యాన్నే గుర్తు చేస్తుంది. మానవ హక్కుల పరిరక్షణకి పాల్పడుతున్న ప్రభుత్వేతర సంస్థలను ప్రోత్సహించడం కమీషన్‌ బాధ్యత అయినప్పటికీ ఈనాటికీ స్త్రీల హక్కులకోసం పోరాడుతున్న మహిళాసంఘాల సహకారాన్ని తీసుకున్న దాఖలాలు కాని, ప్రోత్సహించిన సందర్భాలు కాని కమీషన్‌కు లేవు. ( ఒక మానవ హక్కుల న్యాయవాదిగా తెలిసినమేరకు) అలాగే జనాభాలో సగభాగమైన స్త్రీలకో కమీషన్‌ సభ్యుల నియామకంలో ప్రత్యేకఅవకాశాలు లేవు. హక్కుల పరిరక్షణలో భాగంగా స్త్రీలకు ఒక హెల్ప్‌లైన్‌ లేక స్త్రీల హక్కుల భావపరివ్యాప్తికి సాహిత్యం, ప్రత్యేక సమావేశాల ఏర్పాట్లు లేవు. మరి స్త్రీల హక్కుల పరిరక్షణ ఎలా అంటారా? మన హక్కులకై ప్రాతినిధ్యానికై మనమే నడుం కట్టాలేమో! అయితే ప్రభుత్వం లేక రాజ్యం సామాజిక సంబంధాలను యధాతధా స్థితిలో కొనసాగించే పరికరం. అది కూడా కుటుంబాన్ని మతాన్ని, వర్గాన్ని మరీ ముఖ్యంగా పితృస్వామ్య విలువల్ని పరిరక్షించడానికే పాటుపడుతుంది. కాబట్టి సంబంధిత న్యాయమూర్తులకు పితృస్వామ్యంపట్ల అవగాహన ప్రగతిశీల భావాలు లేకపోతే మరింత సమస్యల్లో యిరుక్కున్నట్టే. కమీషన్‌ యొక్క స్వేచ్ఛ, సమానత, సౌభ్రాతృత్వ ప్రమాణాలను ప్రశ్నించవలసిన అవసరం కేవలం బాధిత స్త్రీలకే పరిమితం కాకూడదు. ఈ కమీషన్‌ మానవ హక్కుల పరిరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు యిచ్చే సూచనలలో సిఫార్సులలో, స్త్రీల పాత్ర పెరగాలి. మానవ (స్త్రీల) హక్కుల పరిరక్షణ అన్నది స్త్రీ పురుషుల స్నేహ సంబంధాల కోసం తీవ్ర అన్వేషణ చేసే ప్రతి ఒక్కరి సాంఘిక బాధ్యత కూడా.
ఐక్యరాజ్యసమితిలో మానవ హక్కుల కమిటీలో భారతదేశం ఒకటి అయిన తరుణంలో అలసిన స్వప్నాలతో ‘ఆమె’ శిథిలం కాకమునుపే, ఆకుపచ్చని జీవితం సాయుధమై తిరగబడకముందే విధ్వంస విస్పోటానికి ‘ఆమె’ నాంది కాకముందే మానవహక్కుల మరో ఇంధ్రధనస్సు ఆవిష్కరణ సాధ్యం కాదేమో!

మానవ హక్కుల కమీషన్‌ – మనం


మానవ హక్కుల కమీషన్‌ – మనం

హేమ
నమ్మిన సిద్ధాంతం కోసం చావునే లెక్క చేయకుండా నడిచిన బాటలో అతడు నేలకొరిగితే, కలల శకలాలలను మూట గట్టుకొని ఆశయాల సజీవ స్వప్నమై జనసంద్రంలో కలిసి జీవైక హక్కులకై పోరాడాలనుకుంటుంది  ”ఆమె” ఒక అక్క. హింసాహింసల మధ్య  సన్నటి పరదాలను తొలగించి చూస్తే పగిలిన జీవన దర్పణంలో అస్తిత్వం వెయ్యి ముక్కలై పకపకమని నవ్వుతుంది. ”ఆమె” ఒక ఇల్లాలు. గ్రీన్‌ హంట్‌లో భాగంగా సర్కార్‌ సైన్యాలు అడవి బిడ్డల్ని చేరబడితే న్యాయస్థానాల ముంగిటకు నడిచి వచ్చిన ”ఆమె”, వాకపల్లి. ప్రభుత్వఆసుపత్రిలో నీడలేక రోడ్డు మీదే ప్రసవించి, బిడ్డలను కోల్పోయే ”ఆమె” పేదరాలు. వీరందరూ, తమహక్కుల గురించి ప్రశ్నిస్తూన్న వాళ్లే. అయితే ఇంతకు మునుపులా కాకుండా వీరందరూ ‘మానవ హక్కుల కమీషన్‌’ కు రావడం కొత్త మలుపు. అందుకే ఈ మానవ హక్కుల కమీషన్‌ అంటే ఏమిటో తెలుసుకునే చిన్న ప్రయత్నమే ఇది.
రెండు ప్రపంచ యుద్ధాలు  మానవ జీవితంలో అంతులేని విషాదాన్ని, వేదనను మిగిల్చాయి. ఈనేపథ్యంలో మానవహక్కులను నిర్వచించడం ఆనాటి తక్షణకర్తవ్యంగా మారి విశ్వజనీన మానవ హక్కుల ప్రకటనకు దారితీసింది. మానవహక్కులంటే  ”భారతరాజ్యాంగంలోని ప్రాధమిక హక్కులలో పొందు పరిచి  అభయమివ్వబడిన వ్యక్తి జీవితం, స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సమానత్వం, గౌరవం లేక ఇంకా అంతర్జాతీయఒప్పందాలలో పొందుపరిచి భారతదేశ కోర్టులలో అమలు పరిచే అవకాశం వున్న హక్కులన్ని మానవ హక్కులే” అని గ్రాంథిక భాషలో చెప్పిన నిజానికి స్త్రీ జీవితంలో పెత్తనాన్ని వ్యతిరేకించేదే హక్కు. స్త్రీ తాను నమ్మినదానికై ఆత్మగౌరవంతో శ్రమించి బుద్దిబలంతో దోపిడీ వివక్షకు వ్యతిరేకంగా జీవించేదే మానవ హక్కు. అందుకే స్త్రీల హక్కులన్ని మానవ హక్కులుగా మనముందుకొచ్చాయి. కొన్ని  స్త్రీల ప్రగతికి బతికే హక్కుకి అడ్డంకులుగా మారినప్పుడు ఆ హక్కుల పరిరక్షణలో భాగంగా వాటిని త్రోసిపుచ్చే ప్రయత్నంలో  సంఘనియమాలను  చట్టాలను ఉల్లంఘిస్తే వాటికి వ్యతిరేకంగా పోరాడితే  అది జీవించే హక్కు వ్యక్తీికరణలో భాగంగా చూడాలి. అందుకే  బ్రతికేహక్కుకోసం అమలులో వున్న నియమాలను ధ్వంసం చేసే హక్కు ప్రతి స్త్రీ కలిగివుంటుంది.  అయితే ప్రశ్నల్లా వాటిని ఎక్కడ ప్రశ్నించాలా అన్నదే. అందుకు కొన్ని వ్యవస్థలను ఏర్పాటు చేసినట్లు రాజ్యం ప్రకటించింది.
వాటిలో భాగంగానే  మహిళా జాతీయకమీషన్‌, షెడ్యూల్డ్‌ కులాల, జాతుల జాతీయ కమీషన్‌, మైనారిటీ జాతీయకమీషన్‌, మానవ హక్కుల కమీషన్‌లు ఏర్పడ్డాయి. ఈ మధ్య  మనం  మహిళ కమీషన్‌కంటే  మానవ హక్కుల కమీషన్‌ కొన్ని  సామాజిక పొరపాట్లపై ప్రతిస్పందించడం గమనిస్తాం! (అవి ఏమేరకు న్యాయం చేకూర్చనప్పటికీ కూడా..) ఇదే మానవ హక్కుల కమీషన్‌ స్త్రీల హక్కులకై చేస్తున్న కృషిని పరిచయం చేయడానికి ప్రయత్నిస్తాను. మానవ (స్త్రీల) హక్కుల ఉల్లంఘన కమీషన్‌ దృష్టికి వచ్చినప్పుడు కమీషన్‌ తనకుతానుగా గాని, బాధితులుగాని, బాధితుల తరఫునగాని ఎవరైన ఫిర్యాదు చేసినప్పుడు కమీషన్‌ విచారిస్తుంది. ఏదైనా కోర్టులో విచారణలో వున్నప్పుడు ఆ కోర్టు అనుమతితో కమీషన్‌ స్త్రీల హక్కుల విషయంలో జోక్యం కలుగజేసు కోవచ్చు. జైళ్ళను అదేవిధంగా వ్యక్తులను చికిత్సకోసం, సంస్కరణలకోసం, రక్షణకోసం సంబంధించిన ఇతర ప్రభుత్వ సంస్థలను దర్శించి అక్కడ నిర్భంధంగా వున్న వ్యక్తుల బాగోగుల గురించి, స్థితిగతుల గురించి అధ్యయనం చేసి వాటి మెరుగుదలకు కావలసిన చర్యలు చేపట్టవచ్చు. అవసరమైతే నష్టపరిహారాన్ని ఇప్పించవచ్చు. మానవ హక్కుల భావవ్యాప్తికై సాహిత్యాన్ని అందరికీ అందేటట్లు చేయడం, సెమినార్‌లు నిర్వహించడం మీడియాద్వారా కృషిచేయడం చేస్తుంది.
సాధారణంగా కమీషన్‌లు పితృస్వామ్యం, కులస్వామ్యం, ధనస్వామ్యం చేసే ఉల్లంఘనలకంటే పోలీసుహక్కుల ఉల్లంఘనకై కమీషన్‌లో వ్యాజ్యాలు వేస్తుంటారు. సమాజంలో వున్న శక్తివంతమైన గ్రూఫులు పాల్పతున్న  మానవ హక్కుల ఉల్లంఘన  విచారణపై కమీషన్‌ సామర్థ్యంపై ప్రజలకు అనుమానం వుంది. (నిజానికి ఎంతోమంది స్త్రీలకు ఈ కమీషన్‌ గురించి తెలియదు) ఇంకో విషయం ఏమిటంటే  మానవ హక్కు ఉల్లంఘనకు పాల్పడుతున్న పబ్లిక్‌ సర్వ్‌ంట్‌లే కాదు ప్రేక్షక పాత్ర వహించేవారు కూడా ఉల్లంఘనకు బాధ్యులవుతారు. క్రిమినల్‌ ప్రొసిజర్‌ కోడ్‌లోని 26వ ఛాప్టర్‌ సె.195 ప్రకారం కమీషన్‌ను  సివిల్‌ కోర్ట్‌గా పరిగణిస్తారు. ఈ కమీషన్‌కు బాధితులకు, బాధితకుటుంబాలకు సత్వర న్యాయసహాయం అందజేయడానికి సిఫారస్సు చేయడానికి మాత్రమే అవకాశం వుంది. అంతేకాని ఆదేశించే అవకాశం అధికారం లేదు. అంటే కమీషన్‌ అధికారానికి నియంత్రణ వుంది. అదే విధంగా ఉల్లంఘనలకు పాల్పడిన వ్యక్తులపై తగినచర్యలు తీసుకోమని సిఫారస్సు మాత్రమే  కమీషన్‌ చేయగల్గుతుంది.ఈ సిఫారస్సుపై ప్రభుత్వ చర్యలు తెలియజేయాలి. కమీషన్‌ రిపోర్ట్‌లు ఉభయ సభలకు అందజేయపడ్తాయి. దీనివలన ప్రజల నిరసనని ప్రభుత్వాన్ని గురి చూసే అవకాశం వుంది. సాయుధదళాలు స్త్రీలపై జరిపే హక్కుల ఉల్లంఘనపై  కేంద్రప్రభుత్వం నుంచి  రిపోర్టు రాకపోయిన సంతృప్తి చెందకపోయినా విచారణ జరపడానికి అవకాశం లేదు.( మానవ హక్కులు – మంగారి రాజేందర్‌) మానసిక బాధిత స్త్రీలపౖౖె జరిగిన సంఘటన ఈ నేపథ్యాన్నే గుర్తు చేస్తుంది. మానవ హక్కుల పరిరక్షణకి పాల్పడుతున్న ప్రభుత్వేతర సంస్థలను ప్రోత్సహించడం కమీషన్‌ బాధ్యత అయినప్పటికీ ఈనాటికీ స్త్రీల హక్కులకోసం పోరాడుతున్న మహిళాసంఘాల సహకారాన్ని తీసుకున్న దాఖలాలు కాని, ప్రోత్సహించిన సందర్భాలు కాని కమీషన్‌కు లేవు. ( ఒక మానవ హక్కుల న్యాయవాదిగా తెలిసినమేరకు) అలాగే జనాభాలో సగభాగమైన స్త్రీలకో కమీషన్‌ సభ్యుల నియామకంలో ప్రత్యేకఅవకాశాలు లేవు. హక్కుల పరిరక్షణలో భాగంగా స్త్రీలకు ఒక హెల్ప్‌లైన్‌ లేక స్త్రీల హక్కుల భావపరివ్యాప్తికి సాహిత్యం, ప్రత్యేక సమావేశాల ఏర్పాట్లు లేవు. మరి స్త్రీల హక్కుల పరిరక్షణ ఎలా అంటారా? మన హక్కులకై ప్రాతినిధ్యానికై మనమే నడుం కట్టాలేమో! అయితే ప్రభుత్వం లేక రాజ్యం సామాజిక సంబంధాలను యధాతధా స్థితిలో కొనసాగించే పరికరం. అది కూడా కుటుంబాన్ని మతాన్ని, వర్గాన్ని మరీ ముఖ్యంగా పితృస్వామ్య విలువల్ని పరిరక్షించడానికే పాటుపడుతుంది. కాబట్టి సంబంధిత న్యాయమూర్తులకు పితృస్వామ్యంపట్ల అవగాహన ప్రగతిశీల భావాలు లేకపోతే మరింత సమస్యల్లో యిరుక్కున్నట్టే. కమీషన్‌ యొక్క స్వేచ్ఛ, సమానత, సౌభ్రాతృత్వ ప్రమాణాలను ప్రశ్నించవలసిన అవసరం కేవలం బాధిత స్త్రీలకే పరిమితం కాకూడదు. ఈ కమీషన్‌ మానవ హక్కుల పరిరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు యిచ్చే సూచనలలో సిఫార్సులలో, స్త్రీల పాత్ర పెరగాలి. మానవ (స్త్రీల) హక్కుల పరిరక్షణ అన్నది స్త్రీ పురుషుల స్నేహ సంబంధాల కోసం తీవ్ర అన్వేషణ చేసే ప్రతి ఒక్కరి సాంఘిక బాధ్యత కూడా.
ఐక్యరాజ్యసమితిలో మానవ హక్కుల కమిటీలో భారతదేశం ఒకటి అయిన తరుణంలో అలసిన స్వప్నాలతో ‘ఆమె’ శిథిలం కాకమునుపే, ఆకుపచ్చని జీవితం సాయుధమై తిరగబడకముందే విధ్వంస విస్పోటానికి ‘ఆమె’ నాంది కాకముందే మానవహక్కుల మరో ఇంధ్రధనస్సు ఆవిష్కరణ సాధ్యం కాదేమో!

గల్ఫ్‌ బుచ్చమ్మ

గల్ఫ్‌ బుచ్చమ్మ

హేమ
ఒక ముని మాపు వేళ కల్లోల సముద్రాలకావల బ్రతుకు తెరువు కోసం కంటిపాపదాయని కన్నీటిని చీర చెంగుకు ఒత్తుకుంటూ పిల్లల్ని గుండెలకు హత్తుకొని కడసారి వీడ్కొలు చెబుతుంది ‘ఆమె’. కొంగు ముడివేసుకొని గంపెడు ఆశలతో సహచర్యం కోరుకొని అత్తారింటికి అడుగు పెట్టిన ఆరునెలలకే అప్పుల బాధ తాళలేకో, ఆడబిడ్డ పెళ్ళికో, చారెడు అరక స్వంతం చేసుకోవడానికో, మరిన్ని అప్పులు చేసి వలస వెళ్ళిపోయే మగని నిశ్శబ్ద నిష్క్రమణకు సాక్షిగా నిలిచిపోతుంది ‘ఆమె’. ఆమె ఎవరో కాదు. తమ వారి భవిష్యత్తు కోసం రెక్కలల్లారుస్తూ గల్ఫ్‌ దేశాలకు వలస వెళ్ళే స్త్రీమూర్తి ఒకరైతే, బీడు భూములపైన కలల విత్తనాలు చల్లుకుంటూ ఆశల లోగిలిలో అతని కోసం ఎదురు చూసే గల్ఫ్‌ వలస కార్మికునికి భార్య/ తల్లి ‘ఆమె’.
గురజాడ అప్పారావు రచించిన ‘కన్యాశుల్కం’ లోని బుచ్చమ్మ పాత్రలాంటిదే ఈమె బ్రతుకు చిత్రం. గిరీశం మాటల్లో చెప్పాలంటే ‘ఓ పూర్‌ విమెన్‌’. కాలం మారినా విజ్ఞానం వికసించినా అణిచివేత, దోపిడి రూపాలు మాత్రం మారాయనటానికి ఈమె సజీవ సాక్షి. గిరీశంలాంటి వాళ్ళు ఎందరో ఆశలు కల్పించి జీవితాలతో ఆడుకుంటారు. ప్రపంచీకరణ నేపధ్యంలో ‘ఆమె’ శరీరం ఒక సరుకు మాత్రమే కాదు డబ్బు సంపాదించే ఒక యంత్రంగా కూడా మారింది. గడపదాటటమే కష్టమయిన పితృస్వామ్య సమాజంలో సంద్రాన్కి ఆవల భిన్నమైన సమాజంలోకి ఆమె విసిరివేయబడింది. అక్కడ ఆహారం వేరు. అలావాట్లు వేరు. కట్టుబాట్లు వేరు. భాషరాదు. బాధొస్తే పంచుకునే నేస్తముండదు. భారమైన పనితోపాటు యజమానుల హింసా దౌర్జన్యాలను పంటిబిగువున భరించాలి. ఒక్కోసారి వేశ్యవృత్తిలోకి నెట్టి వేయబడుతుంది. ఒంటరి కొవ్వొత్తిలా కరిగిపోయే ‘ఆమె’ తన కుటుంబానికి, దేశానికి సంపదను చేకూర్చే అంతర్జాతీయ వలస కార్మికులు.
ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకు లెక్కల ప్రకారం సుమారు 5 మిలియన్ల మంది వలస కార్మికులైతే అందులో 14.6% మహిళా కార్మికులు ఉన్నారు. మొత్తం 7,37,300 మందిలో 3,68,650 మంది యింటి పని కార్మికులైతే మిగతావారు నర్సులు మరియు కొంత నైపుణ్యం కలిగిన, నైపుణ్యం లేని కార్మికులే. వీరి వలన 52 మిలియన్‌ డాలర్లు దేశానికి విదేశీ మారకద్రవ్యం అందుతుందని అంచనా. పాస్‌పోర్టు చట్టం 1967 ప్రకారం యజమాని నుంచి ఖచ్చితమైన విధి విధానాలతో క్లియరెన్సు వుండాలి. 2002 జూలైలో 30 సంవత్సరాల కంటె తక్కువ వయస్సున్న స్త్రీలను గల్ఫ్‌ దేశాలకు పనికి వలస వెళ్ళకూడదని నిబంధనలు పెట్టారు. అయినా ఏజెంట్లు, బ్రోకర్లు ఇమ్మిగ్రేషన్‌ అధికారులు  కుమ్మక్కై వేలాదిమంది యువతుల్ని నిబంధనలకు వ్యతిరేకంగా పంపుతున్నారు. 2007 వ సంవత్సరంలో భారత ప్రభుత్వం గల్ఫ్‌ దేశాలకు వెళ్ళే మహిళా యింటిపని కార్మికులకు కనీస  వేతనం 400 డాలర్లు ఉండాలని, 2500 డాలర్లు డిపాజిట్‌ చెయ్యాలని ప్రతిపాదించినా, కార్మిక సంక్షేమం పట్టించుకునే దేశాలకు మాత్రమే వీసా మంజూరు చేస్తామని ప్రకటించినా అవి పేపర్లకు మాత్రమే పరిమితమయ్యాయి. కేవలం రూ. 4000 నుంచి 7000 వరకే వీరి వేతనం పరిమితమవుతుంది. వీరికి ఏ దేశీయ, అంతర్జాతీయ చట్టాలు న్యాయాన్ని, రక్షణను యివ్వలేకపోతున్నాయి.
వలస పోయిన స్త్రీకి జీవితం ఒంటరితనపు ఎడారిగా మిగిలితే, సజీవ జ్ఞాపకాలతో సహచరుని జాడలు వెతుక్కునే వలస కార్మికుని సహచరి జీవితం అంతకంటే దుర్లభం. భర్త చేసిన అప్పులకు బందీ అయ్యి వడ్డీ వ్యాపారస్థులు, వారి ఏజెంట్ల అఘాయిత్యాలకు బలవుతుంది, అప్పటివరకు కాస్తో కూస్తో చేదోడు వాదోడుగా వున్న భర్త భారాన్ని కూడా మోయాల్సి వస్తుంది. తెలంగాణ జిల్లాలకు చెందిన మస్తానమ్మ మాటల్లో చెప్పాలంటే ‘మొగుడు మొద్దులు లేని నీకు షోకులేంటి’ అని ఆమె కట్టుబొట్టుపై కూడా పరోక్ష నియంత్రణ వుండనే వుంటుంది. తొలకరి జల్లై పలకరిస్తాడని పలవరించే ఆమెలాంటి ఎందరికో స్వప్న సంద్రంలో సూర్యాస్తమయమైనట్టు సహచరుడు శవమై వచ్చిన సందర్భాలెన్నో!
అన్ని మానవ హక్కులు హరించబడుతున్న ఈ ఎడారి పూలు వెలుగు రేఖలను వెదుక్కుంటూ యిప్పుడిప్పుడే సంఘటితమవుతున్నారు. మరికొందరు ఆ పరిస్థితుల నుండి తప్పించుకొని స్వదేశానికి చేరుకొని కోర్టులను సైతం ఆశ్రయిస్తున్నారు. కేరళలోని కులశేఖర పత్తి గ్రామానికి చెందిన మహిళ వేసిన పిటిషన్‌ను విచారించిన కేరళ హైకోర్టు న్యాయమూర్తులు జె. చలమేశ్వర్‌ మరియు పి. ఆర్‌ రామచంద్రాన్‌, షార్జాలో జరిగిన సెక్స్‌ రాకెట్‌ గురించి విచారించి రిపోర్టు చెయ్యమని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తే అనేక వాస్తవాలు వెలుగు చూసాయి. ఈ సంఘటన దేశంలోని గల్ఫ్‌ బాధితులకు పోరాటస్ఫూర్తిని యిచ్చింది. అలాగే యిప్పటివరకు అసంఘటితంగా వున్న గల్ఫ్‌ బాధిత కుటుంబాలు ఒక్కటవ్వడానికి తెలంగాణ జిలాల్లలో కదులుతున్నారు. ఇంతకీ ఈ స్త్రీ మూర్తులు సంఘాల డిమాండ్లు వారు మాట్లాడిన అంశాలు తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను.
కేంద్ర ప్రభుత్వం గల్ఫ్‌ దేశాలతో వలస కార్మికుల పని కుదుర్చుకునే ఒప్పందాలలో వారి పనిగంటలు, సంఘాలు ఏర్పాటు చేసుకొనే హక్కు, వారి డబ్బు సరియైన బ్యాంకు ద్వారా స్వదేశానికి చేరవేసే ఏర్పాటు, సెలవులు, తమ వారితో సంభాషించడానికి ఫోన్‌ ఏర్పాటు , ఇతర పని విధానాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఏజెంట్లు బ్రోకర్ల అవినీతి, అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దేశాన్ని వదిలిపెట్టే ముందు పని సంబంధిత శిక్షణ యివ్వాలని, స్త్రీ మహిళా ఇమ్మిగ్రేషన్‌ అధికారులను నియమించాలని డిమాండు చేస్తున్నారు. భవన నిర్మాణ కార్మికులకు కేంద్రం అమలు చేసే జీవిత భీమా పథకాన్ని తమకు వర్తింపచేయాలని ప్రతిపాదిస్తున్నారు.  ఈ పథకం ప్రకారం మొదటి సంవత్సరంలో రూ. 62 ఆ తర్వాత సంవత్సరాలలో రూ. 12 కడితే ఆ కుటుంబ యజమాని గల్ఫ్‌లో ప్రమాదవశాత్తు మరణిస్తే రెండు లక్షలు, ప్రమాదం జరిగితే రూ. 32 వేలు, రెండు ప్రసవాలకు రూ. 5000 మంజూరవుతాయి. గతంలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం లక్ష రూపాయలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని గల్ఫ్‌లో చనిపోయినవారి చావులకు ప్రభుత్వం నైతిక బాధ్యత వహించి కుటుంబాలను ఆదుకోవాలని ఉద్యమిస్తున్నారు.
ఈ కాలమ్‌ ముగించే సమయానికి గల్ఫ్‌ డైలీ న్యూస్‌ వార్త ఏమిటంటే 70 ఏళ్ళ యజమాని హింస భరించలేని 22 ఏళ్ళ ఇధియోపియన్‌ స్త్రీ ఆ పురుషుని మర్మాంగాలు కోసి వేసిందని.. ఆమె ఆవేదనని అర్ధం చేసుకున్న మానవ హక్కుల కార్యకర్తలు అక్కడ దోపిడి, దౌర్జన్యాలపై ఎలుగెత్తి చాటుతున్నారు. మరి మనం కూడా ‘ఆమె ‘ పోరాటానికి మద్దతు తెలిపే సమయమాసన్నమైంది. అయినా ‘పుట్టిన గడ్డ మీద బుక్కెడు బువ్వ దొరికితే నా బిడ్డకు యిన్ని కడగండ్లు రావు కదా”! అన్న ఆ తల్లి ప్రశ్నకు జవాబు దొరికెదెప్పుడో! విషాద, నిశ్శబ్ద శిధిల జ్ఞాపకాల్ని కౌగిలించుకొని కనుమూసిన ‘ఆమె’కు తొలి వెలుగుల సూర్యోదయమెప్పుడో కదా!!!

ఆకాశమై కమ్మేస్తాం!!

                 ఆకాశమై కమ్మేస్తాం!!

హేమ 
‘రేపు నేను పతివ్రతామ తల్లిని కాను ప్రబంధ కన్యను కాను
పంచదార చిలుకను కాను పంచాది నిర్మల వారసురాల్ని” – ఓల్గా
పోటెత్తిన సంద్రపు అలలపై వెండి జలతారులా మెరిసే వెన్నెల్లాగా కరవాక మహిళ స్ఫూర్తి, చైతన్యాన్ని, మన ఆలోచన, ఆచరణలో భాగంగా చేసుకొని వారి పోరాటానికి బాసటగా వుంటామని నూరేళ్ళ మహిళా దినోత్సవం సందర్భంగా బాస చేసిన కొన్ని రోజులకే మన నిబద్దతనే ప్రశ్నిస్తున్నట్టుగా ‘ఆమె’ కరవాక మహిళపై దాడి. ఆ దాడి గురించి వడ్డితాండ్రలోని మహిళా నాయకురాలు దమయంతిని అడగండి! స్త్రీలు పిల్లలు అని కూడా చూడకుండా మూసిన తలుపుల గుండా పొగ బాంబులు పెట్టి ఉక్కిరిబిక్కిరి చేసి బయటకు నెట్టేసిన ప్రభుత్వ దాష్టికాన్ని గురించి వివరిస్తుంది. భయపడి పొలాల్లోకి పారిపోతే గ్రామాల చుట్టూ కాపుకాసి తప్పతాగి స్త్రీలపై అసభ్యంగా ప్రవర్తించి వెంటాడి పెరేడు జరిపించిన పోలీసుల గురించి ఆమె కన్నీటి కథల ద్వారా మనకు తెలియచేస్తది. ఎనభైఏళ్ళ మరో అనంత మాణిక్యమ్మ బట్టలు వుతకడానికి వెళుతుంటే ఆమె నక్సలైటు ప్రతినిధిగా కనిపించిందేమో మానవ హక్కుల సాక్షిగా నర్సన్నపేట జైలు పాలయ్యింది. కాల్పులు జరిగిన ఆకాశలక్కవరంలో చనిపోయిన ఎర్రన్న, నాగేశ్వరులు, సహచరిణులను అమరవీరుల స్మారక సభలో పలకరిస్తుంటే కన్నీళ్ళు ఎందుకు చెల్లెమ్మా కత్తులు దూయవే చెల్లెమ్మా అన్న చిన్ననాటి ఉద్యమపాట, మనకు స్ఫురణకు వస్తది. మోతెత్తిన నినాదాల ప్రతిధ్వని ఈ దోపిడి వ్యవస్థలో ప్రకంపనలు సృష్టిస్తామని ‘ఆమె’ చేసిన బాసగా హోరెత్తింది.
ఒక్క బాధితులేనా భూమిపై బంధం, ప్రకృతిపై మనసు పడ్డ ప్రతి బిడ్డ ‘పోరు శ్రేణిలో’ ముందుంది. ఏ ఉద్యమ నాయకుని చదువుకున్న బిడ్డల్ని కలవండి. తమకున్న సాంకేతిక పరిజ్ఞానంతో తమ ప్రజలు చేసే ధర్మ పోరాటానికి మరింత పదును పెడుతుంది. భూమిని వనరులను దోపిడి వర్గాల నుంచి విముక్తి చేయాలని నడుం బిగించిన ప్రజల బిడ్డ లక్ష్మి మనకు స్వాగతం చెబుతుంది. సోంపేటలో అయితే అట్టడుగుకు అణిచివేయబడ్డ కులాల నుంచి ‘నేను సైతం’ అంటూ ఉద్యమానికి ముందు నిలిచింది. కేరీరే జీవిత లక్ష్యంగా ముడిపడి వున్న పెట్టుబడిదారి ఆలోచనలకు భిన్నంగా ప్రభుత్వ ఉద్యోగాల్ని సైతం వదలుకోవడానికి సిద్ధపడ్డ డాక్టరమ్మలు వున్నారు. ప్రభుత్వం కొడుకుని నక్సలైటుగా ముద్రవేస్తే దానికి గర్విస్తానని చెప్పి వాన్‌పిక్‌ వ్యతిరేక ఉద్యమానికి ఊపిరి పోసిన తల్లులు వున్నారు. అన్ని ఉద్యమాలకు పుట్టినిల్లుగా మారిన వేటపాలెం ‘వెంకమ్మలు’ ఉన్నారు.
దేశంలోనే మొట్టమొదటిసారిగా కాకినాడ సెజ్‌ వ్యతిరేక పోరాట మహిళా సంఘాన్ని ఏర్పాటు చేసుకొని పితృస్వామ్య భావజాలానికి అడ్డుగుట్ట వేసి పోరులో సగమై చరిత్ర సృష్టించిన రాములమ్మలు, ఆధిపత్య బ్రాహ్మణ కులంలో జన్మించినా ఆచారాలు, వ్యవహారాలు భూతల్లి విముక్తి తర్వాతనే అని తోటి స్త్రీలతో కలిసిపోయిన సావిత్రిలు ఉన్నాయి. కేసులకు కన్నీళ్ళకు వారు వెనుదిరగలేదు. ఎస్‌.కోటలో జిందాల్‌ పెట్టిన కొలిమిపై సవాలు విసిరిన దేవుడమ్మ, సంద్రం మాదేనంటూ ఉద్యమంలో ఉవ్వెత్తున ఎగసిపడిన గంగవరం, పరవాడ, కరవాక మహిళ, ఆంధ్ర వలస పెట్టుబడిదారుల దోపిడిపై పిడికిలెత్తుతున్న తెలంగాణ తల్లులు, తొలిసారిగా ఎన్నికలలో గళమెత్తిన పోలేపల్లి సెజ్‌ వ్యతిరేక పోరాట మహిళలు, ధ్వంసం అవుతున్న గుట్టుల రట్టును బయటపెడుతున్న కరీంనగర్‌ నిర్మల అలాగే ఇతర రాష్ట్రాలలో వనరుల దోపిడికి వ్యతిరేకంగా పోరాడుతున్న విద్యానటేష్‌, ఉల్కా మహాజన్‌, అక్రమంగా కేసులు బనాయించబడ్డ న్యాయవాదులు. ”మాకు మా హక్కులు కావాలి, మానవ హక్కులు కావాలి” అని ఈజిప్టులో ఉద్యమానికి ఊపిరిలూదిన ఆస్మా మెహఫౌజ్‌ యిలా ఎందరో… మెజార్జీ వాదుల ఆధిపత్య భావజాల సాహిత్యంపై సవాలు విసురుతున్న దళిత బహుజన, మైనార్టీ వర్గ స్త్రీమూర్తులు మనకు తెలియని మన చరిత్ర సృష్టికర్తలుగా మనముందున్నారు.
నూరేళ్ళ మహిళా ఉద్యానవనంలో పూసిన ఈ మట్టిపూలు చేస్తున్న పోరాటంలో వైవిధ్యం ఉంది. పౌరహక్కుల గురించి, పునరుత్పత్తి విధుల గురించి, కుటుంబ సంబంధాల గురించి, స్త్రీపురుష సంబంధాలను ప్రభావితం చేసే పితృస్వామ్య సంస్కృతి గురించి పోరాడిన స్త్రీమూర్తుల సాహసాన్ని ఊపిరిగా తీసుకొని రైతాంగ గిరిజన ఉద్యమాల బాటలో ప్రపంచీకరణ, సామ్రాజ్యవాద సంస్కృతికి, మతోన్మాదానికి, కులతత్వానికి వ్యతిరేకంగా ప్రకృతి ముద్దుబిడ్డలుగా పిడికిలెత్తుతున్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని కొనసాగిస్తున్న మనం (ఉద్యమకారులతో సహా) మొన్న పితృస్వామ్యానికి ఎదురొడ్డి నిలిచిన సావిత్రి బాయిపూలే, కుల మత రక్కసిని ప్రశ్నించి ప్రాణాలు పోగొట్టుకున్న కారంచేడు ఆలిశమ్మ వర్గ పోరాటాల విశిష్టతను చాటిచెప్పిన పంచాది నిర్మల, చాకలి ఐలమ్మ, వలసవాదాన్ని తిప్పి కొట్టిన ఝాన్సీరాణి, తెలంగాణ లక్ష్మి స్మరణలో వారి వర్ధంతినో, జయంతినో మన ఆశయాల సాధన కోసం మన మహిళా దినోత్సవాలుగా ఎందుకు ప్రకటించలేకపోతున్నాం? ఒక్కసారి ఆలోచించాలి! ఏది ఏమైనప్పటికీ ‘కారా’ మాష్టారు అన్నట్టు ‘ఆమె’ ఆవేశం అర్థం చేసుకోవాలంటే ఆమె స్థానంలో మనముండాలి. అంతేకాదు ఆమె గుండె మనకుండాలి.
సామాజిక న్యాయం, శాంతి కోసం పోరాడుతున్న ఈ సందర్భంలో ‘ఆమె’కు పరిపరి దండాలు. ఇవిగో స్నేహపూరిత ఆత్మీయ వందనాలు!… ఆకాశమై కమ్మేస్తున్న ‘ఆమె’కు నినాదాల నీరాజనాలు!!

కరవాక మహిళ

కరవాక మహిళ

హేమ  అటు భూమి ఇటు సంద్రానికి మధ్య తెరచాప లాంటి తీరమే కరవాక ప్రాంతం. 
మానవాళిని అలరిస్తూ భూమిని ముద్దాడి వెనుతిరిగే కడలి అలల నురగలు, ఇసుక తిన్నెలు, మడ అడవులు కొన్నిచోట్ల సముద్రపు పొంగులో ఉద్భవించిన  నీటికత్తాలు, ప్రకృతికి పరవశిస్తూ స్వేచ్ఛగా గాలిలో పల్టీలు కొడుతూ క్షణకాలం సంతోషాన్ని పంచుతూ పదసవ్వడి అలికిడికే బుడుగున నీళ్ళలో జారిపోయి తన్మయత్వంతో అలల సయ్యాటలాడే విహంగాల మధ్య సూర్యోదయం నుంచి సూర్యస్తమయం వరకు తన వారికోసం బాధ్యతలను మోసే తరంగమే ఆమె కరవాక మహిళ.
తీరంలో సాంప్రదాయ మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళి వస్తే పట్టిన చేపలను గ్రేడింగు చేయటం, వేలం పాటపాడటం, అమ్మకం ధర నిర్ణయించడం, శుభ్రపరచడం, ఎండబెట్టడం, నిల్వచేయడం, అమ్మడం తదితర అన్ని పనులు చేస్తుంది. వలలు తయారు చేయటం, వేటకు అవసరమైన వనరులు సమకూర్చడం,  నావ తదితర పరికరాలను శుభ్రపరచటంలో ప్రధాన పాత్ర పోషిస్తారు. గతంలో స్త్రీలు చేపలవేటలో పాల్గొనేవారు కాదు. ఇపుడు అలవి వల వేటలో పాల్గొంటారు. కొన్ని చోట్ల పురుషులతో పాటు నావలపై వలను లాగటానికి సహాయపడతారు. దేశంలో వ్యవసాయ ఉత్పత్తిలో స్త్రీల భాగస్వామ్యం విషయమై ఓ మేరకు లెక్కలు వున్నా 7000 కోట్ల పైగా విదేశీ మారకం  సంపాదిస్తున్న కరవాక మహిళ శ్రమశక్తి, ఉత్పత్తిలో ఆమె భాగం గురించి గణాంకాలు ఏమి లేవు.
కరవాకతో మమేకమై స్థానిక వనరులను సామాన్య ఉమ్మడి ఆస్తులగా ఓ మేరకు అనుభవిస్తున్న కరవాక మహిళ జీవితంలో సునామీ కంటే తీవ్రమైన ‘ప్రపంచీకరణ’ చుట్టు ముట్టేసింది. రొయ్యల సాగు, నాగరీకరణ, పారిశ్రామికరణ, పారిశ్రామిక కాలుష్యం, ఓడరేవుల అభివృద్ధి, ఆధునీకరణ, పర్యాటకాభివృద్ధి, కోస్టల్‌ కారిడారు కరవాక మహిళ జీవన విధానంలో చిచ్చురేపాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంవలన సముద్రంలో పట్టిన చేపలు అత్యాధునిక నౌకలతోనే ప్రాసెసింగు, గ్రేడింగు,ప్యాకింగు జరిగిపోవటంవలన కరవాక మహిళ ఉపాధి కోల్పోతోంది. మార్కెటింగులో అనేక మార్పులు వచ్చాయి. స్థానిక వ్యాపారవ్యవస్థ పతనమై కమీషన్‌ ఏజెంటు వ్యవస్థ రావటంవలన పురుషులే అగ్రభాగాన వున్నారు. పరిశ్రమలోని లాభాలు చూసి ఇతర ఆధిపత్య వర్గాల కులాలు పెట్టుబడులు పెట్టడంవలన వారి పురుషుల చేతుల్లోకి మత్స్య పరిశ్రమ వెళ్ళిపోయింది. ప్రభుత్వం వ్యాపార దృక్పథంలో ఈ వృత్తిలో ప్రవేశించిన వారిని మత్స్యకారులుగా గుర్తించడంలవలన ‘కరవాక మహిళ’ తన ప్రత్యేక అస్థిత్వాన్ని కోల్పోయింది. వలల తయారీ స్థానికంగా వుండడంవలన గతంలో స్త్రీలు, పిల్లలకు ఆర్ధికంగా కొండంత ఆసరాగా వుండేది. బడా కంపెనీలను రాయితీలు, సబ్సిడీలు, యాంత్రీకరణ కరవాక మహిళనే కాదు మొత్తంగా మత్స్యసరుదనే దెబ్బ కొట్టింది. ఈ పెను మార్పు వలన మత్స్యకారులు యితర రాష్ట్రాలకు (సెప్టెంబరు నుండి ఏప్రిల్‌ వరకు) మరబోట్లుపై కూలీలుగా పనిచేయడానికి వెళితే ఆర్ధికంగా, సామాజికంగా హింసను యిబ్బందులు ఎదుర్కొంటారు. ఒక వేళ కుహానా అభివృద్ధి పేరిట ప్రాజెక్టులు వచ్చినా ఉద్యోగం పురుష లక్షణం అన్న పితృస్వామిక భావజాలం కలిగిన సమాజంలో కరవాక మహిళకు, ఎలాంటి ఉపాధి దొరకదు అని గత ప్రాజెక్టులే చెబుతున్నాయి.
తమ అవసరాలు తీర్చుకోవడానికి ప్రభుత్వ సహాయ సహకారాలతో ఏర్పడిన సహకార సంఘాలు పురుషులకు నాలుగువేలకు పైగా వుంటే స్త్రీల సహాకార సంఘాలు మూడు వందలకు మించి లేవు. ఏవో చిన్న చిన్న రుణాలు పొందడం తప్ప ఈ సంఘాలద్వారా కరవాక మహిళలకు ఒరిగింది ఏమి లేదు. ఆంధ్రప్రదేశ్‌ మత్స్య సహకార సంఘాల సమాఖ్యలో స్త్రీల పాత్ర మచ్చుకైనా కనబడదు. స్త్రీల సాధికారత గురించి మాట్లాడే ప్రభుత్వం గతంలో సునామీ వచ్చిన సందర్భంలో మత్స్యకారులకు ఉచితంగా యివ్వవలసిన దానిని రుణాలు రూపంలో యిచ్చి మహిళలు కాస్తో కూస్తో దాచుకున్న డబ్బును అప్పుల క్రింద జమ చేసుకుంది, యింక ప్రకృతి వైపరీత్యాలు, సునామీ పైన పేరు చెప్పుకొని దేశ విదేశాల నుంచి డబ్బులు దండుకున్న సంస్థలెన్నో!
సామాజికంగా వెనుకబడిన కులాలకు (బిసి.ఎ) చెందిన కరవాక మహిళపై పితృస్వామ్య భావజాల ప్రభావం ఎక్కువగానే వుంటుంది. పొద్దుపొడుపుతోపాటు లేస్తే పొద్దు గుంకే వరకు ఉపాధి వెతుకులాటతో పాటు పిల్లల పెంపకం, చదువు, ఆరోగ్యం, పరిశుభ్రత, ఆర్ధిక లావాదేవీలు స్త్రీలపైనే ఆధారపడి వుంటాయి. అయినప్పటికీ వాళ్ళు భర్త, తండ్రుల ద్వారానే సమాజంలో గుర్తింపు పొందుతారు. వీరిలో నిరక్షరాస్యత, బాల్యవివాహాలు ఎక్కువే. ఆర్ధిక వెసులుబాటు వున్నా గృహహింస కూడా ఎక్కువే. చేపల బుట్టలను తలపై పెట్టుకొని ఊరూర తిరిగి అమ్ముకుని కరవాక మహిళ ఎక్కువగా . నరాలు, తల సంబంధిత అనారోగ్యంతో బాధపడుతుంది. అధిక శ్రమ, అనాదరణ ఆమెను మరింత క్రుంగదీస్తుంది. యింతేకాకుండా సమాజంలోని ఆధిపత్య కులాలు మత్స్యకారుల గ్రామాలకు వచ్చి దాడులుచేసి స్త్రీలను పరాభవించిన సందర్భాలెన్నో!  దీనిని తీర ప్రాంత గ్రామాలతో పాటు గుంటూరుజిల్లా రేపల్లె చుట్టూ  ప్రక్కల గల తీర ప్రాంతం, యితర ప్రాంతాలలో కరవాక మహిళలు ఎండుచేపలు సంతల్లో   అమ్ముకోవడానికి వచ్చినపుడు అక్కడి ఆధిపత్య కులా పురుషులు వీరి దగ్గర డబ్బులు దండుకోవడం అంటూ బత్తాలు అంటూ చేయడం పరిపాటిగా మారిందని వాపోతున్నారు. ఇదీ నేటి స్వతంత్ర, భారత వనిలో కరవాక మహిళ దుస్థితి.

నాకూ స్పేస్‌ కావాలి

నాకూ స్పేస్‌ కావాలి

 
         ఎస్‌.ఎమ్‌.ఎస్‌… అనేక కమర్షియల్‌ మెసేజ్‌ల నుంచీ (ఎస్‌ఎంఎస్‌ సముద్రమంత స్నేహాన్ని) మోసుకొచ్చింది…అది విశాలమైన ప్రపంచంలో మనల్ని మనం తడిమి చూసుకోడానికి, కాసింత అలసిన హృదయాన్ని శరీరాన్ని సేద తీర్చటానికి మనలో వున్న భావపరంపరలు కవితాత్మరూపం తీసుకోడానికి ‘ఆకాశాన్నే హద్దు’గా పిలిచిన ఆహ్వానం అది. ఆ తర్వాత చాలామంది మిత్రులతో మాట్లాడాను. ఆ అపురూపమైన ఆహ్వానం గురించి కొంతమంది చూసామని ఆలోచిస్తామని మరికొంత మంది అసలు గమనించలేదని… ఎందుకో ఆకాశాన్నే ముద్దాడాలనే కాంక్ష చప్పబడిపోయింది. ఒకసారి స్త్రీ జీవితాన్ని తరచి చూస్తే కూడా అంతేనేమో. 24 గంటల సమయంలో 16-18 గంటలు యితరుల కోసం పనిచేసే మనకు మన గురించి ఆలోచించడానికి వాటిని ఆచరణలో పెట్టే విషయమై ఎన్నో పోరాటాలు, ఎన్నో ఉద్యమాలు. ఏ వర్గాన్ని చూసినా మనకు స్పష్టమే. బాల్యం, యవ్వనం, కౌమారం, వృద్ధాప్యంలో ఎప్పుడైనా తమ కోసం ఒక స్పేస్‌ ఏర్పాటుకై తపన చెందే స్త్రీలు ఎందరో ఉన్నారు. వారందరికీ వందనాలు. కాని వ్యవస్థలో ఎవరో చేసిన తప్పులకు బ్రతుకు పోరులో నిలబడటానికి బలౌతున్న స్త్రీమూర్తులెందరో …వారి గుండె గూటిలోకి వెళ్లి ఒక క్షణం ఉపశమనం పొంది మీ ముందు కొచ్చేదే ‘ఆమె  పరిచయం’..
ఆమె ముఖం నిండా ముసుగేసి ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుంది. ఆ ముసుగు వెనకాల కథలోని జీవిత వాస్తవాలలోకి వెళితే ‘ఆమె’ తెలంగాణలోని ఓ వెనక పడ్డ జిల్లా నుంచి వచ్చింది. భర్త మేనమామ అయినప్పటికీ ఆమె పెళ్లి బంధం ఆమె అందాన్ని చూసి భయపడింది. అణిచి ఉంచాలన్న అతని కోరిక నెరవేరలేదు. ఆమె ఎదురు తిరిగిన ప్రతిసారి ఆమెపై పడిన వాతలు మరకలై మిగిలిపోయేవి. భర్త నుంచి విడిపోయినా, ఊళ్ళో మిషను కుట్టుకుంటూ కాలం గడిపినా, అతను ఆమెను వదలలేదు. చాలీ చాలని డబ్బు, పిల్లల పోషణ, అతని హింస, హైదరాబాదులోని ఫిలిం ఇండస్ట్రీలోకి నెట్టి వేసాయి. అక్కడ ఏదో చిన్నా చితకా పని చేసిన ఆమె చుట్టూ ఒక విషవలయం.. ఆమె అందం, ఆడతనం, ప్రతి ఒక్కరికీ పందేరం వేయవలసిందే. అక్కడ ఒక అతనితో పరిచయం, గుప్పెడు మెతుకుల కోసం రోజూ కష్టపడే కంటే కొన్ని సంవత్సరాలు ఎవరికీ తెలియకుండా వ్యభిచార గృహం నడిపించి ఆ డబ్బుతో పిల్లల్ని చదివించుకోవచ్చని, భవిష్యత్‌ ఏర్పాటు చేసుకోవచ్చని అన్నింట్లో అండగా ఉంటానని ప్రోత్సాహిస్తే ఒప్పుకుంటుంది. పిల్లల పెంపకం కోసం బంధువులను సైతం పోషిస్తుంది. కానీ కొన్నాళ్ళకే పోలీస్‌ రైడింగ్స్‌, ప్రోత్సహించిన గృహ నిర్వాహకుడు ఆమెను ముఠా నాయకురాలిగా, వ్యభిచార గృహ నిర్వాహకురాలిగా, ఒప్పించి పోలీసులకు అప్పగిస్తాడు.
అందుకు చెప్పిన కారణం సంఘంలో అతని పేరు పరువు ప్రతిష్టలు దెబ్బతింటాయని డబ్బుకు కొదవ చేయనని ఆమెను ఆదుకొంటానని జైలు పాలు చేసాడు. నిర్వాహకుడి దమన నీతి తెలిసినా ఇద్దరి పిల్లల చదువు మధ్యలో ఆపలేక వారి భవిష్యత్తు పాడు చేయలేక ఒప్పుకొంటుంది. ఆమెను కలిసినప్పుడు చాలా సార్లు ఒకే మాట అంది. ఈ వృత్తిలో మేము ఎవ్వరం కావాలని రాలేదని, కేవలం సమాజంలో తమ పిల్లలకు ఓ స్థానం కల్పించాలనే కోరికే యిలా తయారు చేసిందని, అనుక్షణం భయం భయంగా గడిపే తమకు జీవితం పట్ల ప్రేమ, దయ ఉందని, కాని తమ చుట్టూ వున్న సమాజం, వృత్తిలో కరిగిపోతూ పెంచుతున్న పిల్లలు ఎవ్వరూ ఆదరించరని నిర్ధ్వందంగా చెప్పుకుంటూ పోయింది. తానే కాదు చదువుకుంటున్న పిల్లలు, ఇతర స్త్రీలు ఎలా ఊబిలోకి దిగబడిపోతున్నారో కధలు కధలుగా చెప్పింది. క్లయింట్‌లు హింసించరా అన్నదానికి నా భర్త పెట్టిన హింస కంటే తక్కువేనని గట్టిగానే చెప్పింది. యిష్టం లేకపోయినా వృత్తి కోసం శరీరాన్ని ఒక షేప్‌లో ఉంచుకోవడానికి తీసుకునే జాగ్రత్తలు గురించి ఆమె మాట్లాడుతున్నప్పుడు మోచేతి క్రింద వున్న పచ్చబొట్టు ఆమె ఊరు, సంప్రదాయాలు వేదనని గాజుల సవ్వడితో కలిసి ఘోష పెడుతున్నట్టనిపించింది.
ఆమె వేెదనా ఘోష యిప్పటిది కాదు. వేద కాలం నుంచే ఉన్నది. కౌటిల్యుని కాలం నుండి  ఈనాటి ప్రపంచీకరణ వరకూ స్త్రీ శరీరం ఒక వస్తువేే. రూపాలు వేరు అయిన  ఆనాటి రాజ్యాలు పడగొట్టడానికి విష పూరిత మూలికా ఔషదాలను వాడి కొంత మంది స్త్రీలను విష కన్యలుగా మార్చినట్టు ఈ రోజు మార్కెట్‌ ప్రతిపాదిత సామ్రాజ్యం పునాది కోసం స్త్రీ శరీరం కావలసి వచ్చింది. మన చట్టాలు ద్వంద వైఖరినే ఆవలంబిస్తున్నాయి. వీటి ప్రకారం వ్యభిచారం చట్ట విరుద్ధం కాదు! అలాగని చట్ట పరమైనది కాదు. వ్యభిచారాన్ని బహిరంగ స్థలాలకు 200 గజల దూరంలో చేసుకొనవచ్చును. వీరిని శ్రామికులుగా గుర్తించరు కాబట్టి కనీస వేతనాలు, వసతులు, నష్టపరిహారంలాంటివి లభించవు. ఐ.పి.సి సెక్షన్‌ 366ఎ, 366బి. వ్యభిచారం కోసం స్త్రీలను, పిల్లలను సరఫరా నేరం క్రింద పరిగణించినా లెక్కలకు అందని రీతిలో ఇంకా ఆ వృత్తి కొనసాగుతూనే వుంది.  రోజుకు 200 మంది చొప్పున 20 శాతం మంది 18 సంవత్సరాల లోపు వారు ఈ వృత్తిలో ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం 2.3. మిలియన్ల మంది ఈ వృత్తిలోనికి నెట్టి వేయబడ్డారు.ఇందులో 60శాతం మంది పేదరికంలో మగ్గుతూ, ఎలాంటి అవకాశాలు చదువులేని దళిత బహుజన వర్గాలకు చెందినవారే.
ఈనాడు ‘ఆమె’ గొంతు వింటే మనకు జాలి కలుగవచ్చు. కానీ ఆమె సానుభూతి, దయను కోరుకోలేదు. ఆమెను ఒక ‘మనిషి’గా గుర్తించమని తానూ వెలివేయబడ్డ సమాజం నుంచి మరెవ్వరూ ఈ వృత్తిలోనికీ ప్రవేశించకూడదని కోరుతుంది. వ్యవస్థీకృతమైన విధానాలలో మార్పు కొరకు జరిగే మన పోరులో తమ బాధలకు, కన్నీళ్ళకు, ఆశలకు కొంచెం స్పేస్‌ ఇవ్వమని, ఆమెను మన మనుసులో మన విధానాల రూపకల్పనలో భాగం చేయమని కోరుతున్నది. స్త్రీలపై హింసకు వ్యతిరేక దినాన్ని జరుపుకుంటున్న మనం ఒక్కసారి ‘ఆమె’ శరీరం మనసుపై జరిగే దాడి, సంఘ వెలివేత గురించి ఆలోచించి మన ‘స్పేస్‌’ని ఆమె పోరు కోసం మరింత విశాలం చేద్దామా!!

Text